పెరుగుతున్న ధరలు, నిరుద్యోగమే లోక్ సభలో భద్రత ఉల్లంఘనకు కారణం - రాహుల్ గాంధీ
Lok Sabha security breach : దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul gandhi) అన్నారు. నిత్యవసర ధరలు కూడా అధికమవుతున్నాయని, ఇవే ఇటీవల పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘన (Parliament security breach) జరగడానికి కారణమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల యువతకు ఉద్యోగాలు లభించడం లేదని విమర్శించారు.
![Rising prices, unemployment are reasons for security breach in Lok Sabha - Rahul Gandhi..ISR Rising prices, unemployment are reasons for security breach in Lok Sabha - Rahul Gandhi..ISR](https://static-ai.asianetnews.com/images/01hfs085y2nv6vya1pxbsedsqh/whatsapp-image-2023-11-21-at-6-40-54-pm_363x203xt.jpg)
Lok Sabha security breach : పెరుగుతున్న ధరలు, నిరుద్యోగమే డిసెంబర్ 13వ తేదీన లోక్ సభలో జరిగిన భద్రతా ఉల్లంఘనకు కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ గుజరాత్ శాఖ నేతలతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘనకు కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలే అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విధానాల వల్ల యువతకు ఉద్యోగాలు లభించడం లేదని తెలిపారు.
ఆర్థిక సాయం కోరుతున్న కాంగ్రెస్ పార్టీ.. 18 నుంచి ‘డొనేట్ ఫర్ దేశ్’ క్యాంపెయిన్ ప్రారంభం
పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన జరిగిందని, కానీ ఎందుకిలా జరిగిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశంలో అతి పెద్ద సమస్య నిరుద్యోగం అని, దీని వల్ల దేశమంతా ఉక్కిరిబిక్కిరి అవుతోందని చెప్పారు. మోడీ విధానాల వల్ల దేశ యువతకు ఉపాధి లభించడం లేదని తెలిపారు.
ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో జరిగిన ఘటనను తాము రాజకీయం చేయలేదని అన్నారు. ‘‘ ఢిల్లీ పోలీసులు దీనిని (పార్లమెంటు భద్రతా ఉల్లంఘన) ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు. అది కేంద్ర హోం మంత్రి పరిధిలోకి వస్తుంది కదా? మేము (ప్రతిపక్ష సభ్యులు) ఈ సంఘటనను రాజకీయం చేయలేదు. మేము దీనిని ఉగ్రవాద దాడి అని అనలేదు. ప్రభుత్వం వైపు నుంచి భద్రతా లోపం స్పష్టంగా కనిపించడంపై మాత్రమే మా ఆందోళనను వ్యక్తం చేశాం’’ అని తెలిపారు.
అండర్-19 వరల్డ్ కప్ జట్టులో తెలంగాణ క్రికెటర్ కు చోటు..
దుష్ప్రవర్తన కారణంగా 13 మంది కాంగ్రెస్ ఎంపీలను పార్లమెంటు నుండి సస్పెండ్ చేయడాన్ని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. ‘‘ఈ కొత్త పార్లమెంటు భవనం ప్రపంచంలోనే సురక్షితమైన ప్రదేశం అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇటీవల జరిగినదానికి కారణం భద్రతా లోపం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు సభ్యులకు జరిమానా విధిస్తున్నారు.’’ అని ఆరోపించారు. 13 మంది కాంగ్రెస్ సభ్యులతో పాటు తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ను కూడా ప్రస్తుత శీతాకాల సమావేశాలకు సభాపతి జగదీప్ ధన్ కర్ సస్పెండ్ చేసిన నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.