New Delhi: దేశంలో ఒక్కరోజే 1,300 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది గత 140 రోజులలో అత్యధికం. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,605 కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా పేర్కొంది.
Coronavirus: దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని వైద్య రిపోర్టులు పేర్కొంటున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. బుధవారం 1,300 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇవి గత 140 రోజుల్లో అత్యధికం కావడం గమనార్హం. దేశంలో క్రియాశీల కేసులు 7,605 కు చేరుకున్నాయి. కొత్త కేసులతో కలిపి మొత్తం కోవిడ్-19 బారినపడ్డవారి సంఖ్య 4,46,99,418కి చేరుకుంది. కొత్తగా కరోనా వైరస్ బారినపడి ముగ్గురు మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 5,30,816కు చేరింది.
కరోనా వైరస్ కారణంగా చనిపోతున్న వారి మరణాల రేటు 1.19 శాతంగా ఉండగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.46 శాతంగా కొనసాగుతోంది. వీక్లీ పాజిటివిటీ రేటు 1.08 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, కరోనా బారినపడి ఇప్పటివరకు 4,46,99,418 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. జాతీయ రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం.. భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 220.65 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. గడచిన 24 గంటల్లో 89,078 టెస్టులు చేయగా మొత్తం 92.06 కోట్ల టెస్టులు చేసినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) గణాంకాలు పేర్కొన్నాయి.
రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త వేరియంట్లను గుర్తించడానికి, ఇన్ ఫ్లూయెంజా వంటి అనారోగ్యాలు-తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి కోవిడ్ -19 వైరస్ మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ ను పెంచాలని ప్రధాని నరేంద్ర మోడీ అధికారులను ఆదేశించారు. వైద్యులు సూచించిన కోవిడ్ నిరోధక చర్యలు, వ్యాప్తి నియంత్రణ చర్యలను పాటించాలని ప్రజలను కోరారు. దేశంలోని కోవిడ్-19, ఇన్ ఫ్లూయెంజా పరిస్థితిని సమీక్షించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో 20 ప్రధాన కోవిడ్ మందులు, 12 ఇతర మందులు, 8 బఫర్ డ్రగ్స్, 1 ఇన్ ఫ్లూయెంజా మందుల లభ్యత-ధరలను పర్యవేక్షిస్తున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది.
మహారాష్ట్రలో బుధవారం 334 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయనీ, అంతకుముందు రోజు కంటే 54 ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇదే సమయంలో ఒక మరణం కూడా సంభవించిందని ఆరోగ్య శాఖ బులెటిన్ లో తెలిపింది. ముంబయిలో 1290 మందికి పరీక్షలు నిర్వహించగా 71 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో పాజిటివిటీ రేటు 5.5 శాతంగా నమోదైంది. ముంబయిలో ప్రస్తుంత 361 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 26 మంది ఆస్పత్రిలో ఉండగా, 10 మంది ఆక్సిజన్ సపోర్ట్ పై ఉన్నారు. తాజా కేసులతో రాష్ట్రంలో కోవిడ్ -19 సంఖ్య 81,40,479 కు, మరణాల సంఖ్య 1,48,430 కు పెరిగింది.
