నిజమైన కారణాలను వెలుగులోకి తీసుకురండి.. రైల్వే ప్రమాదాలను సీబీఐ దర్యాప్తు చేయదు.. - ప్రధానికి ఖర్గే లేఖ
రైల్వే ప్రమాదాలను సీబీఐ దర్యాప్తు చేయదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. వారికి రైల్వేకు సంబంధించిన అనేక సాంకేతిక అంశాలపై అవగాహన ఉండదని తెలిపారు. ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలైన కారణాలను ప్రభుత్వం వెలుగులోకి తీసుకురావాలని ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు.
ఒడిశా రైల్వే దుర్ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ ఘోర ప్రమాదానికి కారణమైన నిజమైన కారణాలను ప్రభుత్వం వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆ లేఖలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సీబీఐ దర్యాప్తును కోరడంపై ఖర్గే మండిపడ్డారు. లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ రైల్వే ప్రమాదాలను దర్యాప్తు చేయడానికి కాదు, నేరాలను దర్యాప్తు చేయడానికి ఉద్దేశించిందని తెలిపారు.
‘‘ ఇన్చార్జి వ్యక్తి, మంచి మనసున్న మీ రైల్వే మంత్రి వైష్ణవ్ సమస్యలు ఉన్నాయని అంగీకరించడానికి ఇష్టపడరు’’ అని కాంగ్రెస్ చీఫ్ లేఖలో ఎద్దేవా చేశారు. ‘‘రైల్వే మంత్రి ఇప్పటికే మూలకారణాన్ని కనుగొన్నట్లు చెబుతున్నారు. అయినా సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. సీబీఐ అంటే రైల్వే ప్రమాదాలను దర్యాప్తు చేయదు. అది నేరాల నేరాల దర్యాప్తు కోసమే. సాంకేతిక, సంస్థాగత, రాజకీయ వైఫల్యాలకు సీబీఐ లేదా మరే ఇతర చట్ట అమలు సంస్థ జవాబుదారీతనాన్ని నిర్ణయించజాలదు. దీంతో పాటు రైల్వే భద్రత, సిగ్నలింగ్, మెయింటెనెన్స్ పద్ధతుల్లో సాంకేతిక నైపుణ్యంపై వారికి అవగాహన ఉండదు ’’అని అన్నారు.
రైల్వే భద్రత క్షీణించడంపై సాధారణ ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారు. అందువల్ల ఈ ఘోర ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించి వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కాగ్ తాజా ఆడిట్ నివేదికలో 2017-18 నుంచి 2020-21 మధ్య 10 రైలు ప్రమాదాల్లో 7 రైళ్లు పట్టాలు తప్పడం వల్లనే జరిగాయని ఖర్గే పేర్కొన్నారు. ‘‘ కానీ దీన్ని పొరపాటున విస్మరించారు. 2017-2021 మధ్య, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో భద్రత కోసం రైల్ అండ్ వెల్డ్ (ట్రాక్ మెయింటెనెన్స్) జీరో టెస్టింగ్ జరిగింది.’’ అని తెలిపారు.
భారత చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. ‘‘ఈ విషాద సమయంలో దేశం ఐక్యంగా ఉంది. అయితే ఎంతో విలువైన ప్రాణాలను కోల్పోవడం ప్రతీ భారతీయుడి మనస్సాక్షిని కదిలించింది. ఈ ప్రాణనష్టం పూడ్చలేనిదని, ఎంత ఆర్థిక పరిహారం ఇచ్చినా.. సంతాప మాటలు మాట్లాడినా ఈ ఘోర విషాదాన్ని పూడ్చలేవు’’ అని ఆయన అన్నారు. రవాణా రంగంలో ఎంత విప్లవాత్మక పురోగతి సాధించినప్పటికీ, భారతీయ రైల్వే ఇప్పటికీ ప్రతి సామాన్య భారతీయుడికి జీవనాడి అని ఆయన పేర్కొన్నారు.
‘‘ఇది అత్యంత విశ్వసనీయమైనది మాత్రమే కాదు.. అత్యంత చౌకైన రవాణా మార్గం.’’ అని తెలిపారు. కానీ రైల్వేలను ప్రాథమిక స్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడానికి బదులు కేవలం వార్తల్లో నిలవడానికే బయట విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని పశ్చాత్తాపంతో చెబుతున్నాను. రైల్వేలను మరింత సమర్థవంతంగా, అధునాతనంగా తీర్చిదిద్దడానికి బదులు సవతితల్లిగా వ్యవహరిస్తున్నారు’’ అని తెలిపారు. కాగా.. సుమారు 2,500 మంది ప్రయాణికులతో వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైళ్లకు శుక్రవారం జరిగిన ప్రమాదంలో 275 మంది మృతి చెందగా, 1,100 మందికి పైగా గాయపడ్డారు.