ఐదుగురితో పెళ్లి: మృతి చెందాక బట్టబయలైన రిటైర్డ్ ఎస్ఐ లీలలు
ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురిని వివాహం చేసుకొన్నాడు ఓ రిటైర్డ్ ఎస్ఐ. అయితే అతను చనిపోయిన తర్వాత అతనికి ఐదుగురు భార్యలున్న విషయం వెలుగు చూసింది.
బెంగుళూరు: ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురిని వివాహం చేసుకొన్నాడు ఓ రిటైర్డ్ ఎస్ఐ. అయితే అతను చనిపోయిన తర్వాత అతనికి ఐదుగురు భార్యలున్న విషయం వెలుగు చూసింది. గుండెపోటుతో రిటైర్డ్ ఎస్ఐ విశ్వనాథ్ మరణించిన తర్వాత ఆస్తుల గొడవల్లో భార్యలు పోలీసులను ఆశ్రయించారు.
కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో రిటైర్డ్ ఎస్ఐ విశ్వనాథ్ ఐదుగురిని వివాహం చేసుకొన్నాడు. అయితే ఒకరికి తెలియకుండా మరోకరితో కాపురం చేస్తున్నాడు. తుమకూరు తాలుకా స్వాందేనహళ్లికి చెందిన విశ్వనాథ్ గుట్టు చప్పుడు కాకుండా ఐదుగురితో కాపురం చేస్తున్నాడు. గత నెల 18వ తేదీన గుండెపోటు రావడంతో ఆయన మృత్యువాత పడ్డాడు.
విశ్వనాథ్ మూడో భార్య వద్ద ఉన్న సమయంలో గుండెపోటు వచ్చింది. ఈ గుండెపోటుతో ఆయన మృతి చెందాడు. అయితే విశ్వనాథ్ మరణించిన విషయం తెలిసిన వెంటనే మొదటి, రెండో భార్య పిల్లలు కూడ వచ్చారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే కర్మకాండలు ముగిసిన తర్వాత ఆస్తుల కోసం విబేధాలు రావడంతో ఐదుగురు భార్యలు పోలీసులను ఆశ్రయించారు.
మొదటి భార్య సరోజమ్మ, రెండో భార్య శారదతోపాటు మూడో భార్య చేతనలే కాకుండా గుట్టుచప్పుడు కాకుండా మరో ఇరువురిని కూడా విశ్వనాథ్ వివాహమాడినట్లు తెలిసింది. అయితే ఇరువురు భార్యలు ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా వదిలేసినట్లు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు తుమకూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 58ఏళ్ళ వయసులోనూ విశ్వనాథ్ 22ఏళ్ళ చేతనను పెళ్ళాడడం ప్రత్యేకం. పనిచేసిన ప్రతిచోటా ఒక సంసారమే నడిపినట్లు తెలుస్తోంది.