జార్ఖండ్ లో రిసార్ట్ రాజకీయాలు షురూ.. రాయ్పూర్కు వెళ్లిన యూపీఏ ఎమ్మెల్యేలు..
జార్ఖండ్లో అధికార యూపీఏ కూటమి ఎమ్మెల్యేలు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు తరలివెళ్లారు. వీరంతా మేఫెయిర్ రిసార్ట్లో బస చేస్తున్నారు. ఆ రిసార్ట్ కు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.
జార్ఖండ్లో రాజకీయ గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలో రిసార్ట్ రాజకీయాలు షురూ అయ్యాయి. అధికార యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వ ఎమ్మెల్యేలను మంగళవారం ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు తరలించారు, సీఎం హేమంత్ సోరెన్ అనర్హత వ్యవహారం క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే ఇది ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
భారత నావికాదళానికి కొత్త జెండా.. కొచ్చిలో ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు ఉన్నాయి. ఇందులో అధికార యూపీఏ కూటమికి 49 మంది సభ్యుల మెజారిటీ ఉంది. ఈ కూటమిలో 30 మంది జేఎంఎం, 18 మంది కాంగ్రెస్, ఒక ఎమ్మెల్యే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి చెందిన ఎమ్మెల్యే ఉన్నారు.జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు చార్టర్డ్ విమానంలో మంగళవారం రాత్రి రాయ్పూర్ చేరుకున్నారు. కాగా చత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉండటం గమనార్హం.
జార్ఖండ్ యూపీఏ ఎమ్మెల్యేలు విడిది చేసిన రాయ్పూర్లోని మేఫెయిర్ రిసార్ట్ను చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘెల్ సందర్శించారు. 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 15 మంది జేఎంఎం శాసనసభ్యులు మేఫెయిర్ రిసార్ట్లోని 'సేఫ్ హెవెన్'లో క్యాంప్లో ఉన్నారని వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో మరికొంత మంది సంకీర్ణ శాసనసభ్యులు ఛత్తీస్గఢ్లోని రిసార్ట్కు చేరుకునే అవకాశం ఉందని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రిసార్ట్ చుట్టూ గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. మీడియా వ్యక్తులను లోపలికి అనుమతించడం లేదు.. చత్తీస్గఢ్ కాంగ్రెస్ నేతలు రాంగోపాల్ అగర్వాల్, గిరీష్ దేవాంగన్లు జార్ఖండ్ ఎమ్మెల్యేలను ఎయిర్పోర్టులో రిసీవ్ చేసుకుని బస్సుల్లో రిసార్ట్కు తీసుకొచ్చారు.
హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వేటాడేందుకు ప్రయత్నిస్తోందని జేఎంఎం ఆరోపించింది. భవిష్యత్ వ్యూహాలను రూపొందించడానికి సోరెన్ మంగళవారం అధికారపక్ష ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేలను రాయ్పూర్ కు తరలించాలనే నిర్ణయం తీసుకున్నారు. సోరెన్ ఎమ్మెల్యేగా కొనసాగడంపై ఎన్నికల సంఘం ఇచ్చిన తీర్పుపై రాజ్భవన్ ఇప్పటివరకు మౌనంగా ఉండడంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మంత్రి ఒకరు వార్తా సంస్థ ‘పీటీఐ’కి తెలిపారు.
కాగా సమావేశం ముగిసిన తర్వాత యూపీఏ ఎమ్మెల్యేలు బస్సుల్లో సీఎం నివాసం నుంచి రాంచీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ శ్రేణిలో ఉన్న ఒక బస్సుల్లో హేమంత్ సోరెన్ ఒకదానిలో కూర్చున్నట్టుగా తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఫొటోలను వార్తా సంస్థ ‘ANI’ ట్వీట్ చేసింది.
ఈ పరిణామాలపై సోరెన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఊహించన్నట్టుగా ఏం జరగబోదు. మేము అన్నింటికీ సిద్ధంగా ఉన్నాము, పరిస్థితి మా ఆధీనంలో ఉంది. నేను కూడా ఎమ్మెల్యేలతో (రాయ్పూర్కి వెళ్తే) మీకు తెలియజేస్తాను. ’’ అని ఆయన అన్నారు. కాగా నిన్న తెల్లవారు జామున రాష్ట్రంలోని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై సీఎం సోరెన్ విరుచుకుపడ్డారు. అది రాజకీయ గుర్రపు వ్యాపారానికి పాల్పడుతోందని ఆరోపించారు. ‘‘ ఎమ్మెల్యేలను మాత్రమే కొంటారు, అమ్ముతారు కానీ మేము ప్రజల కోసం పని చేస్తున్నాం, గుర్రపు వ్యాపారం చేయడం లేదు. రాజకీయాల్లో వ్యాపారం చేస్తున్న వారికి ప్రజలే సమాధానం చెబుతారు’’ అని అన్నారు. ‘‘ నేను కుర్చీ కోసం ఎప్పుడూ చింతించను. నేను దళితులు, ఆదివాసీలు, రాష్ట్ర ప్రజల విషయంలో మాత్రమే చింతిస్తున్నాను ’’ అని సీఎం అన్నారు.