సారాంశం

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్‌ 21కి వాయిదా వేసింది. వివరాలు.. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మాజీ ఎంపీ జయప్రదపై స్వార్ కొత్వాలిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారనే ఆరోపణల కింద కేసు నమోదైంది. పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టులో కొనసాగుతోంది.

ఈ కేసులో ప్రాసిక్యూషన్ వాంగ్మూలం పూర్తయింది. మాజీ ఎంపీ జయప్రద తన వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే  వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించినా ఆమె హాజరు కాలేదు. తాజాగా సోమవారం రోజున జయప్రద కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే సోమవారం కూడా ఆమె తరఫు న్యాయవాది హాజరు నుంచి మినహాయింపు కోసం దరఖాస్తును సమర్పించారు. అయితే దానిని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. ఈ క్రమంలోనే జయప్రదపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ అమర్‌నాథ్ తివారీ తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 21న జరగనుంది. 

ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాంపూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన జయప్రద.. సమాజ్‌వాద్‌ పార్టీ అభ్యర్థి అజాం ఖాన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.