అన్నా పక్కన కరుణకు చోటివ్వాల్సిందే: రజనీకాంత్, విశాల్
కరుణానిధి అంత్యక్రియలు అన్నా స్మారకం వద్దే జరగాలని తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ డిమాండ్ చేశారు. మెరీనా బీచ్ కు సంబంధించి హైకోర్టులో పలు కేసులు పెండింగ్లో ఉన్నందు వల్ల అక్కడ స్థలం ఇవ్వడం సాధ్యంకాదని చెప్పింది.
చెన్నై: కరుణానిధి అంత్యక్రియలు అన్నా స్మారకం వద్దే జరగాలని తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ డిమాండ్ చేశారు. మెరీనా బీచ్ కు సంబంధించి హైకోర్టులో పలు కేసులు పెండింగ్లో ఉన్నందు వల్ల అక్కడ స్థలం ఇవ్వడం సాధ్యంకాదని చెప్పింది. ప్రత్యామ్నాయంగా గాంధీ మండపం సమీపంలో గిండీ వద్ద (అన్నా వర్శిటీ ఎదురుగా) రెండెకరాలు స్థలం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
తమిళ ప్రభుత్వ నిర్ణయంపై రజినీకాంత్ స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం కరుణనిధి అంత్యక్రియలు అన్నా మెమోరియల్ వద్ద జరిగేలా అన్ని విధాల కృషి చేయాలని, అదే ఆయనకు మనం ఇచ్చే అత్యంత గౌరవమని, ఇది తన విజ్ఞప్తి అని రజనీకాంత్ అన్నారు.
అంతకు ముందు సినీ నటుడు, నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ కూడా కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్లో జరిపేందుకు ప్రభుత్వం చోటు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.