రాజస్తాన్లో పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం మే 13 నుంచి 16వ తేదీ వరకు పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే, మే 14వ తేదీ సెకండ్ షిఫ్ట్లో నిర్వహించనున్న పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ పేపర్ లీక్తో ఆ పరీక్షను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నారు.
జైపూర్: పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ పరీక్షను అధికారులు రద్దు చేశారు. మే 14వ తేదీన సెకండ్ షిఫ్ట్ పరీక్ష నిర్వహించడానికి కొంత సమయం ముందే ఈ పేపర్ లీక్ అయినట్టు పోలీసులు చెప్పారు. కొశ్చన్ పేపర్ స్క్రీన్ షాట్ తీసి దాన్ని బయటకు పంపినట్టు తెలిసింది.
రాజస్తాన్ రాజదాని జైపూర్లో జోత్వారా టౌన్లో ఈ ఘటన జరిగింది. పోలీసు హెడ్క్వార్టర్ ప్రకారం, మే 14వ తేదీన సెకండ్ షిఫ్ట్ పరీక్ష జరగడానికి కొంత సమయం ముందుగా ఎగ్జామ్ పేపర్ ఎన్వలప్ ఓపెన్ చేశారు. జైపూర్లోని దివాకర్ పబ్లిక్ స్కూల్ సెంటర్ సూపరింటెండెంట్ ఈ ఎగ్జామ్ పేపర్ ఎన్వలప్ కవర్ను సమాయనికి ముందే ఓపెన్ చేశారని పోలీసులు తెలిపారు.
ఈ షిఫ్ట్ పేపర్ను మళ్లీ నిర్వహించనున్నారు. లీక్ అయిన పేపర్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని సోమవారం నిర్ణయం తీసుకున్నట్టు పోలీసులు వివరించారు. అంతేకాదు, పేపర్ లీక్ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
రాజస్తాన్ పోలీసు శాఖ పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో భాగంగా మే 13వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు రిటెన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నది.
బీహార్ లో బీపీఎస్ సీ పేపర్ లీక్ కేసుపై ఆ రాష్ట్రంలో ఈ నెలలో దుమారం రేగింది. దీనిపై ప్రభుత్వం అభ్యర్థులకు సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. పరీక్షకు హాజరయ్యేందుకు ఎక్కువ దూరం ప్రయాణించిన అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మీడియాతో మాట్లాడారు. పేపర్ లీక్ విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.
బీపీఎస్ సీ (బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పేరును బీహార్ పేపర్ లీక్ కమిషన్ గా మార్చాలని తేజస్వీ యాదవ్ సూచించారు.రాష్ట్రం నలుమూలల నుండి ప్రయాణించిన అభ్యర్థుల విషయంలో ఆయన మాట్లాడుతూ.. వారి సమయాన్ని వృథా చేసినందుకు, చాలా దూరం ప్రయాణం చేసేలా చేసినందుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరీక్షను రద్దు చేసినందుకు గాను అభ్యర్థులకు ప్రభుత్వం రూ.5000 నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
