Indian Railways: రైల్వే ప్రయాణీకులకు షాక్ .. డెవలప్ మెంట్ ఫీజు పేరుతో బాదుడు
Indian Railways: రైల్వే ప్రయాణికులకు షాకిచ్చింది కేంద్రం. అభివృద్ది పేరిట అదనపు డబ్బులు చెల్లించాల్సి రానున్నది. రైల్వే బోర్డు తాజాగా స్టేషన్ డెవలప్మెంట్ ఫీజు SDF లేదా యూజర్ ఫీజు వసూలుకు అంగీకారం తెలిపింది. రూ.10 నుంచి రూ.50 మధ్యలో ఈ ఫీజును వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో రైల్వే ప్రయాణికులకు అదనపు భారం పడనుంది. స్టేషన్ డెవలప్మెంట్ ఫీజు కింద మొత్తం మూడు కేటగిరీల్లో ఈ ఫీజును వసూలు చేయనున్నారు. ఏసీకైతే రూ.50, స్లీపర్ క్లాస్కైతే రూ.25, అన్ రిజర్వ్డ్ క్లాస్కైతే రూ.10 చొప్పున ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది.
Indian Railways: ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది రైల్వే శాఖ. సామన్య రైల్వే ప్రయాణీకుల జేబుకు చిల్లులు పడేలా నిర్ణయాలు తీసుకుంది ఇండియన్ రైల్వే. రైల్వే టికెట్ల బుకింగ్ సమయంలోనే టికెట్తోపాటు చార్జీలు వసూలు చేయనున్నారు. కొత్తగా స్టేషన్ డెవలప్ మెంట్ ఫీజు(SDF) లేదా యూజర్ ఫీజు పేరుతో ప్రత్యేక చార్జీలు వసూలు చేయడానికి సిద్దమయ్యింది రైల్వే శాఖ. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది.
ఈ సర్క్యులర్ ప్రకారం.. రైల్వే టికెట్ల బుకింగ్ సమయంలో యూజర్ ఫీజు పేరుతో మూడు కేటగిరీల్లో ఈ ఫీజును వసూలు చేయనున్నారు. దాదాపు ఒక్కో టికెట్పై 10 నుంచి 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేయనుంది రైల్వే శాఖ. అన్ రిజర్వుడ్ టికెట్లపై 10 రూపాయలు, సెకెండ్ క్లాస్ స్లీపర్పై 25 రూపాయలు, అన్ని రకాల ఏసీ కోచ్లల్లో ప్రయాణంపై 50 రూపాయలను అదనంగా వసూలు చేయనుంది. సబర్బన్ రైళ్లకు దీన్నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు రైల్వే బోర్డు పేర్కొంది. అంతేకాదు ఆయా రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధర కూడా రూ.10 మేర పెరగనుంది.
తొలి దశలో కొన్ని స్టేషన్లో మాత్రమే వసూలు చేయనున్నది. అంటే రీడెవలప్మెంట్ లేదా డెవలప్మెంట్ స్టేషన్ల నుంచి జర్నీ చేసే వారు ఈ ఫీజును చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ స్టేషన్లో ట్రైన్ ఎక్కినా.. ఆ స్టేషన్లో ట్రైన్ దిగినా యూజర్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఏ ఏ స్టేషన్ కు ఎంతమేర చేల్లించాల్సి ఉంటుందో త్వరలో ప్రకటన రానున్నది. యూజర్ డెవలప్మెంట్ ఫీజు విధానాన్ని గతేడాదే రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా స్టేషన్ను డెవలప్మెంట్ చేసే ప్రైవేట్ కంపెనీలకు రాబడి వస్తుంది.
ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలను కల్పించే లక్ష్యంగా దేశంలోని పలు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే పశ్చిమ మధ్య రైల్వే పరిధిలోని రాణి కమలాపాటి స్టేషన్, పశ్చిమ రైల్వే పరిధిలోని గాంధీనగర్ కేపిటల్ స్టేషన్ అభివృద్ధి పూర్తవ్వడంతో పాటు అందుబాటులోకి కూడా వచ్చాయి. కాగా, స్టేషన్ డెవలప్మెంట్ ఫీజు వల్ల రైల్వే ఆదాయం పెరగడంతో పాటు, ప్రైవేటు వ్యక్తులను ఆకర్షించడానికి ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.