రైల్వే శాఖ ఏకంగా హనుమంతుడికే నోటీసులు పంపి.. భూమి ఖాళీ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించారని పేర్కొంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
భోపాల్: రైల్వే శాఖ ఏకంగా హనుమంతుడికే నోటీసులు పంపింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించావని ఓ నోటీసును హనుమంతుడి గుడికి అతికించేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో చోటుచేసుకుంది.
ఆక్రమిత భూభాగంలో నుంచి హనుమంతుడి ఆలయాన్ని తొలగించకుంటే జిల్లా అధికారులే యాక్షన్ తీసుకుని ఆ గుడిని తొలగిస్తారని నోటీసులో పేర్కొన్నారు. మొరేనా జిల్లా సబల్గడ్ ఏరియాలో ఓ టెంపుల్ ఉన్నది. ఆ భూమి ప్రభుత్వ స్థలం అని రైల్వే శాఖ పేర్కొంటున్నది. మొరేనా జిల్లాలో బ్రాడ్ గేట్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భూమిలో ఆక్రమణ అధికారుల దృష్టికి వచ్చింది.
అంతేకాదు, ఆ నిర్మాణం కూల్చివేయడానికి అయ్యే ఖర్చులను కూడా హనుమంతుడి నుంచే రికవరీ చేసుకుంటారని అధికారులు ఆ నోటీసులో తెలిపారు.
Also Read: అల్లా, ఓం.. రెండూ సేమ్! దుమారం రేపుతున్న జామియత్ చీఫ్ మహమూద్ మదానీ వ్యాఖ్యలు
నార్త్ సెంట్రల్ రైల్వే, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్ కుమార్ ఈ ఘటనపై స్పందించారు. ఆ నోటీసును పొరపాటుగా హనుమంతుడి పేరు మీద జారీ చేసినట్టు వివరించారు. త్వరలోనే ఆ గుడి పూజారి పేరిట నోటీసు పంపిస్తామని తెలిపారు.
