శతాబ్ది ఎక్స్ప్రెస్లో కేంద్ర రైల్వే మంత్రి.. ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్.. ఏం చెప్పారంటే..
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం శతాబ్ది ఎక్స్ప్రెస్లో తనిఖీ నిర్వహించారు.న్యూఢిల్లీ-అజ్మీర్ శతాబ్ది ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన ఆయన ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం శతాబ్ది ఎక్స్ప్రెస్లో తనిఖీ నిర్వహించారు.న్యూఢిల్లీ-అజ్మీర్ శతాబ్ది ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన ఆయన ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. రైలులో ప్రయాణికులతో మాట్లాడిన వీడియోను కూడా ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆజ్మీర్ శతాబ్ది రైలు ఎక్కడం జరిగిందని పేర్కొన్నారు. అయితే ప్రయాణికులతో ఇంటరాక్షన్ గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ప్రయాణికులు సానుకూల అభిప్రాయాన్ని ఇచ్చారు. రైళ్లు మునుపటి కంటే చాలా శుభ్రంగా ఉన్నాయని.. సమయానికి నడుస్తున్నాయని.. ప్లాట్ఫారమ్లు శుభ్రంగా ఉన్నాయని వారు చెప్పారు’’ అని తెలిపారు.
అయితే ఈ మార్గంలో రెండు కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ముందుగా ట్రాక్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఈ మార్గంలో వేగాన్ని పెంచాలి.. రెండోవది ట్రయల్స్, టెస్టింగ్ తర్వాత పాంటోగ్రాఫ్ రైళ్లు (వందే భారత్) త్వరలో ఢిల్లీ-జైపూర్ మధ్య ఈ ట్రాక్లో నడుస్తాయని చెప్పారు.
రైలులో జర్నీ చేస్తున్న ప్రయాణికుల నుంచి ప్రత్యక్షంగా వారి అభిప్రాయాన్ని తీసుకునేందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చూపిన చొరవను కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు కూడా ప్రశంసించారు. “మంత్రులందరూ నేరుగా అభిప్రాయాన్ని తీసుకోవడం మరియు మీలాగే సంస్కరణాత్మక చర్యలను అమలు చేయడం వంటి పనిని ప్రారంభిస్తే, అన్ని సాంకేతిక లోపాలు పరిష్కరించబడతాయి. ప్రజల దీవెనలు సంపాదించడం కొనసాగించండి సార్’’ అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.