కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలోని బడుగు, బలహీన, వెనుకబడిన, దళిత, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలవడమే ఈ విజయానికి కారణమని అన్నారు.
బెంగళూరు: కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలోని బడుగు, బలహీన, వెనుకబడిన, దళిత, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలవడమే ఈ విజయానికి కారణమని అన్నారు. కర్ణాటకలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ గెలిచిన తర్వాత.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలుపొందింది అని చాలా విషయాలు రాశారు. భిన్నమైన విశ్లేషణలు జరిగాయి. కానీ మేము పేదలు, దళితులు, ఆదివాసీలకు వెన్నంటే ఉన్నందున కాంగ్రెస్ గెలిచిందని నేను చెప్పాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. తమకు సత్యం, పేద ప్రజలు ఉన్నారని చెప్పారు. బీజేపీ డబ్బు, అధికారం, పోలీసులు అన్నీ ఉన్నాయని.. కానీ కర్ణాటక ప్రజలు వాటిని ఓడించారని అన్నారు. కర్ణాటక ప్రజలు అవినీతిని, ద్వేషాన్ని ఓడించారని తెలిపారు. కర్ణాటకలో విద్వేష మార్కెట్లు మూతబడి.. లక్షలాది ప్రేమ దుకాణాలు తెరుచుకున్నాయని చెప్పారు.
‘‘మేము మీకు 5 వాగ్దానాలు చేసాము. మేము తప్పుడు వాగ్దానాలు చేయము అని చెప్పాను. మేం చెప్పినట్టే చేస్తాం. మరో 1-2 గంటల్లో కర్ణాటక ప్రభుత్వం మొదటి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఈ 5 హామీలు చట్టంగా మారుతాయి’’ అని కర్ణాటక ప్రజలకు రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలనను అందిస్తుందని చెప్పారు.
