బెంగాల్లో కాంగ్రెస్కు కొత్త సమస్య.. దీదీపై సొంత పార్టీ నేతల విమర్శలు.. నష్ట నివారణకు రాహుల్ గాంధీ ప్రయత్నం
పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్కు మరో తలనొప్పి ఎదురవుతున్నది. సొంత పార్టీ నేతలే మమతా బెనర్జీ, టీఎంసీ పార్టీపై విమర్శలు సంధిస్తున్నారు. దీంతో ఈ పొత్తు కొనసాగుతుందా? ఆదిలోనే తెగిపోతుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. దీంతో వెంటనే రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. మమతా బెనర్జీ తమకు, తమ పార్టీకి చాలా దగ్గరి వ్యక్తి అని పేర్కొన్నారు.
![rahul gandhi reacts on adhir ranjan chowdhurys jab at mamata banerjee kms rahul gandhi reacts on adhir ranjan chowdhurys jab at mamata banerjee kms](https://static-ai.asianetnews.com/images/01hmdn3761rqypfr84q4y6qasr/Rahul-Gandhi-1705560349888_363x203xt.jpg)
Rahul Gandhi: ఇండియా కూటమికి ఆది నుంచి అవాంతరాలే ఎదురవుతున్నాయి. సీట్ల పంపకాల విషయమై ఈ విభేదాలు వివాదాలుగా మారే అవకాశాలు లేకపోలేదని తెలుస్తూనే ఉన్నది. తాజాగా, ఇలాంటి ఓ ముప్పునే రాజుకోకుండా రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నారు. మమతా బెనర్జీ పార్టీ టీఎంసీతో పొత్తుపై బెంగాల్ కాంగ్రెస్ శ్రేణుల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఇవే అధిర్ రంజన్ చౌదరి నుంచి బయటికి ఎగిశాయి. మమతా బెనర్జీపై అధిర్ రంజన్ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఇండియా కూటమి నుంచి టీఎంసీ బయటికే అన్నట్టుగా రాజకీయవర్గాలు భావించాయి. ఇంతలోనే భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్న రాహుల్ గాంధీ అసోం నుంచే స్పందించారు. అలాంటిదేమీ లేదని, మమతా బెనర్జీ తమకు చాలా సన్నిహితమైన వ్యక్తి అని ముప్పు ముదరకుండా కామెంట్లు చేశారు.
మమతా బెనర్జీ తమకు చాలా క్లోజ్ అని రాహుల్ గాంధీ వివరించారు. టీఎంసీతో సీట్ల పంపకంపై అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యల ప్రభావం ఉండబోదని అన్నారు. సీట్ల సంప్రదింపులు ట్రాక్లోనే ఉన్నాయని వివరించారు.
Also Read : Ayodhya: రామ మందిరంపై కమల్ హాసన్ రియాక్షన్ ఇదే..
‘అవును, కొన్ని సార్లు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరస్పరం విమర్శలు సంధించుకుంటారు. కానీ, అవి చాలా సాధారణం. ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ, అవి కాంగ్రెస్, టీఎంసీ మధ్య గల మైత్రిని భంగరచలేవు. సీట్ల సంప్రదింపుల ఫలితాలు బయటకు వస్తాయి. వాటిపై నేను కామెంట్ చేయను. కానీ, మమతా బెనర్జీ మాత్రం మాకు, మా పార్టీకి చాలా గ్గరి మనిషి’ అని రాహుల్ గాంధీ అన్నారు.
బెంగాల్లో దశాబ్దాల వైరం గల ఈ రెండు పార్టీల మధ్య మైత్రి అనేక సవాళ్లతో నిండి ఉన్నది. అందుకే తరుచూ కాంగ్రెస్ నేతలు బాహాటంగా టీఎంసీపై కటువుగా మాట్లాడుతున్నారు. దీంతో అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొసిగేనా? అనే చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్లో కొత్త లెఫ్ట్ భావాలు ఉన్న నాయకులు లెఫ్ట్తో పొత్తుపై మాట్లాడుతున్నారు.