ఏదో రహస్యం దాస్తున్నట్టే.. పెగాసస్ విచారణకు కేంద్రం సహకించడంలేదనే వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ
పెగాసస్ స్పైవేర్: అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన స్పైవేర్ పెగాసస్ బారిన పడేందుకు లక్ష్యంగా చేసుకున్న భారతీయులలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ: దేశంలో మళ్లీ పెగాసస్ స్పైవేర్ హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఇదే విషయం గురించి విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్ వో గ్రూప్ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్ తో దేశపౌరులపై నిఘా పెట్టారనే దానిపై సుప్రీంకోర్టు ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కమిటీకి సహకరించడం లేదనే వ్యాఖ్యల నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. పెగాసస్ స్పైవేర్ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకు సహకరించలేదంటే ఏదో రహస్యం దాచినట్టు కేంద్రం అంగీకరించినట్టేనని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ అన్నారు.
వివరాల్లోకెళ్తే.. పెగాసస్ స్పైవేర్ కేసుల దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వం ప్యానెల్కు సహకరించడం లేదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. "ఇది ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వానికి దాచివుంచడానికి సంబంధించి లోతుగా ఏదో ఉందని తేలిందని" అన్నారు. పెగాసస్ స్పైవేర్ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకు సహకరించలేదంటే ఏదో రహస్యం దాచినట్టు కేంద్రం అంగీకరించినట్టేనని పేర్కొన్నారు. ''సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి ప్రధానమంత్రి, ఆయన ప్రభుత్వం సహకరించకపోవడం, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేందుకు, దాచడానికి వారికి చాలా లోతుగా పెగాసస్ ఉందని అంగీకరించడమేనని" అని రాహుల్ గాంధీ ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్ వో గ్రూప్ పెగాసస్ స్పైవేర్ ను తయారు చేసింది. దీనిని ఉగ్రవాద, చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడానికి ప్రత్యేక సందర్భాల్లో పలు దేశాలు ఉపయోగించుకుంటున్నాయి. అయితే, భారత్ సహా పలు ప్రభుత్వాలు తమకు వ్యతిరేకంగా గళం విప్పేవారితో పాటు సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని స్నూపింగ్ కోసం చట్టవ్యతిరేకంగా వారిపై నిఘా పెడుతున్నారు. పలు అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన స్పైవేర్తో సోకినట్లు లక్ష్యంగా చేసుకున్న ఫోన్లు, ఇతర విషయాలతోపాటు, స్నూపింగ్ కోసం ఉపయోగించే భారతీయులలో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. వారితో పాటు దేశంలోని అనేక మంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు ఉన్నారు. ముగ్గురు హిందుస్థాన్ టైమ్స్ జర్నలిస్టులు కూడా ఈ జాబితాలో ఉన్నారని నివేదిక పేర్కొంది.
పెగాసస్పై సుప్రీంకోర్టు ఆదేశం
గురువారం నాడు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, తన కార్యాలయంలో చివరి రోజున, పెగాసస్తో సహా అనేక కేసులను స్వీకరించారు . సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ పర్యవేక్షణలో పనిచేసిన ముగ్గురు సభ్యుల కమిటీ సమర్పించిన నివేదికపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కమిటీకి సమర్పించిన 29 ఫోన్లలో మాల్వేర్ ఐదింటిలో మాత్రమే కనుగొనబడిందనీ, అయితే ఇది పెగాసస్ అని ఖచ్చితమైన రుజువు లేదని కమిటీ నిర్ధారించింది. విచారణలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించలేదని కూడా పేర్కొంది. నాలుగు వారాల తర్వాత ఈ కేసు విచారణకు రానుంది.