సారాంశం

లోక్‌సభలో బీఎస్పీ నేతపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని ఎంపీ డానిష్ అలీ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

లోక్‌సభలో బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ ఘరి ఉన్నారు . 

విద్వేషాల మార్కెట్‌లో ప్రేమ దుకాణం: రాహుల్ గాంధీ

ఈ భేటీ అనంతరం రాహుల్ గాంధీ ఓ ట్విట్టర్ వేదిక ఓ పోస్టు చేశారు. విద్వేషాల మార్కెట్‌లో ప్రేమ దుకాణం అనే క్యాప్షన్ పెట్టి.. వారిరువు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. లోక్ సభలో  బీజేపీ ఎంపీ రమేష్ బిధురి తీరు సిగ్గుచేటు అని,  ఇలాంటి చిల్లర చర్యలు సభ గౌరవానికి మచ్చ  లాంటివని అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇటువంటి ద్వేషం, ద్వేషపూరిత మనస్తత్వానికి తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకమని పేర్కొన్నారు. 

నేను ఒంటరిగా లేదు: డానిష్ అలీ

రాహుల్ గాంధీతో భేటీ సమయంలో భావోద్వేగానికి గురైన డానిష్ అలీ తాను ఒంటరి కాదన్నారు. తన నైతిక స్థైర్యాన్ని పెంచేందుకే రాహుల్ గాంధీ తన ఇంటికి వచ్చారనీ,  సభలో జరిగిన అవమానాన్ని గుండెల్లో పెట్టుకోవద్దని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇచ్చారని తెలిపారు. తాను ఒంటరి వాడిని కాదని తేలిపోయిందని ఆయన అన్నారు. ఇది  ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి అని బిఎస్‌పి ఎంపి వ్యాఖ్యానించారు. అమృతకళ సందర్భంగా కొత్త పార్లమెంట్‌లో వీధుల్లో విద్వేషాల దుకాణాలను ఏర్పాటు చేయడం విచారకరమని, లోక్‌సభే మనకు రక్షకమని అన్నారు.

వాస్తవానికి బీఎస్పీ ఎంపీ  డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి లోక్‌సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో రమేష్ బిధూరిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆ పార్టీ ఎంపీపై బీజేపీ అధిష్టానం షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది.ఇదిలా ఉండగా.. బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.