రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే అధికారం లోక్సభ సెక్రెటేరియట్కు లేదని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. తాము ఈ పోరాటాన్ని రాజకీయంగానూ, లీగల్గానూ చేస్తామని జైరాం రమేశ్ అన్నారు.
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీని లోక్సభ నుంచి అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్సభ సెక్రెటేరియట్ ఈ రోజు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. వయానాడుకు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడినట్టు ఆ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ నోటిఫికేషన్ విడుదల కాగానే కాంగ్రెస్ నేతలు కొందరు తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్యానికే దుర్దినం అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. తాము న్యాయపరంగా, రాజకీయంగా పోరాటం చేస్తామని జైరాం రమేశ్ అన్నారు. కాగా, అసలు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే అధికారం లోక్సభ సెక్రెటేరియట్కు ఉండదని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మనీశ్ తివారీ అన్నారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే ప్రక్రియపైనా కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది. లోక్సభ సెక్రెటేరియట్ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు విధించలేరని స్పష్టం చేశారు. ఒక ఎంపీపై అనర్హత వేటును రాష్ట్రపతి.. ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపి వేస్తారని వివరించారు. వాస్తవాలను మాట్లాడేవారిని బీజేపీ కోరుకోదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అందుకే రాహుల్ గాంధీని టార్గెట్ చేసిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం జైలుకైనా వెళ్లడానికి సిద్ధం అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరిని ఈ ఘటన వెల్లడిస్తుందని కేసీ వేణుగోపాల్ అన్నారు.
Also Read: రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు.. సూరత్ కోర్టు తీర్పు వెలువడ్డ రోజు నుంచే..!
రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు సంబంధించిన ప్రక్రియ వేగాన్ని చూసి తాను స్టన్ అయ్యానని శశిథరూర్ పేర్కొన్నారు. తీర్పు వెలువడిన 24 గంటల్లో అనర్హత వేటు వేశారని వివరించారు. ఇంకా ఈ తీర్పుపై అప్పీల్ చేయాల్సి ఉన్నదనీ గుర్తు చేశారు. ఇవి దాడులకు సిద్ధమైన రాజకీయాలు అని, ఇది ప్రజాస్వామ్యానికి చేటు అని ట్వీట్ చేశారు.
కాగా, జైరాం రమేశ్.. ఆ నోటిఫికేషన్ను పోస్టు చేస్తూ.. ఈ పోరాటాన్ని తాము రాజకీయంగా, న్యాయపరంగానూ చేస్తామని ట్వీట్ చేశారు. తమను ఎవరూ భయపెట్టలేరని, తమ గళాన్ని ఎవరూ నొక్కేయలేరని పేర్కొన్నారు. అదానీ మహా మెగా స్కామ్ పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయకుండా వారు చేసిందేమిటంటే.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు అని తెలిపారు. భారత ప్రజాస్వామ్యానికి ఓం శాంతి అని ట్వీట్ చేశారు.
సూరత్ కోర్టు తీర్పును పై కోర్టులో రాహుల్ గాంధీ సవాల్ చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ తీర్పును పైకోర్టులో సవాల్ చేస్తామని రాహుల్ గాంధీ టీమ్ పేర్కొంది.
సూరత్ కోర్టు తీర్పును పైకోర్టు కొట్టేయకుంటే రాహుల్ గాంధీ మరో ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదు.
