రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు.. సూరత్ కోర్టు తీర్పు వెలువడ్డ రోజు నుంచే..!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేశారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చిన తర్వాతి రోజే ఈ వేటు పడింది.
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీపై ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. పార్లమెంటు నుంచి ఆయనను డిస్క్వాలిఫై చేశారు. 2019 క్రిమినల్ డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడ్డ మరుసటి రోజే లోక్సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే, అనర్హత వేటు మాత్రం తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆ నోటిఫికేషన్ పేర్కొనడం గమనార్హం.
రాహుల్ గాంధీ కేరళలోని వయానాడ్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
ఈ రోజు లోక్సభ సెక్రెటేరియట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అందులో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడినట్టు వివరణ ఉన్నది. కేరళలోని పార్లమెంటు వయానాడ్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిందని ఆ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ అనర్హత మార్చి 23వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు వివరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం, ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
Also Read: ‘మోడీ ఇంటి పేరు’ కేసులో రాహుల్ గాంధీకి శిక్ష.. తీర్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ భారీ నిరసన
మార్చి 23వ తేదీనే గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహల్ గాంధీని ఓ పరువు నష్టం కేసులో దోషిగా తేల్చింది.
సూరత్ కోర్టు తీర్పును పై కోర్టులో రాహుల్ గాంధీ సవాల్ చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ తీర్పును పైకోర్టులో సవాల్ చేస్తామని రాహుల్ గాంధీ టీమ్ పేర్కొంది.
సూరత్ కోర్టు తీర్పును పైకోర్టు కొట్టేయకుంటే రాహుల్ గాంధీ మరో ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదు.
2019లో కర్ణాటకలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ కోర్టును ఆశ్రయించారు. ఆర్థిక నేరస్తులను పేర్కొంటూ వీరిందరి ఇంటి పేరు మోడీ అనే ఎందుకు ఉంటున్నది? అంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు. దీంతో మోడీ ఇంటి పేరున్న పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసు విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. 30 రోజుల పాటు ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ రాహుల్ గాంధీకి అవకాశం కల్పించింది.