చండీగఢ్ ను పంజాబ్ కు మాత్రమే రాజధానిగా ఉంచాలని ఇటీవల ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ హర్యానా అసెంబ్లీ కూడా నేడు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో చండీగఢ్ అంశం ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్ గా మారింది.
చండీగఢ్ను పంజాబ్ కు మాత్రమే కేటాయించాలని సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని హర్యానా అసెంబ్లీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు హర్యానా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని మంగళవారం ఆమోదించింది. ఈ తీర్మానం కోసం నేడు హర్యానా అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది.
పంజాబ్ పునర్వ్యవస్థీకరణ వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలన్నింటినీ పరిష్కరించే వరకు కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య సమతుల్యతకు భంగం కలిగించే విధంగా ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈ తీర్మానంలో డిమాండ్ చేశారు. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966లోని సెక్షన్ 3లోని నిబంధనలను కూడా ఖట్టర్ హైలైట్ చేశారు. ఈ చట్టం ద్వారా హర్యానే రాష్ట్రం ఉనికిలోకి వచ్చింది.
కాాగా ప్రస్తుతం చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. అలాగే ఈ పట్టణం పంజాబ్, హర్యానాల ఉమ్మడి రాజధానిగా ఉంది. అయితే గత శుక్రవారం పంజాబ్ అసెంబ్లీ చండీగఢ్ పట్టణాన్ని పంజాబ్కు బదిలీ చేయాలని కోరింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం భగవంత్ మాన్ కేంద్రపాలిత ప్రాంతం, ఇతర ఉమ్మడి ఆస్తుల సమతుల్యతను భంగపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆరోపిస్తూ బీజేపీ శాసన సభ్యులు సభను వాకౌట్ చేశారు. దీంతో ఈ తీర్మానాన్ని పంజాబ్ అసెంబ్లీ మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది.
అయితే పంజాబ్ తీర్మానాన్ని హర్యానాలోని రాజకీయ పార్టీలు తిరస్కరించాయి. హర్యానా అసెంబ్లీలో మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్వైఎల్ కెనాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. “ SYL కాలువ నిర్మాణం ద్వారా హర్యానా రావి, బియాస్ నదుల జలాలను పంచుకునే హక్కు చారిత్రాత్మకంగా, చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా కాలక్రమేణా స్థాపించబడింది. SYL కాలువను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఆగస్టు సభ కనీసం ఏడు పర్యాయాలు ఏకగ్రీవంగా తీర్మానాలను ఆమోదించింది ”అని ఖట్టర్ గుర్తు చేశారు.
ఈ సమావేశం సందర్భంగా హర్యానా ప్రతిపక్ష నాయకుడు భూపిందర్ సింగ్ హుడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్దేశాన్ని ప్రశ్నించారు. ఈ పరిణామాన్ని రాజకీయ జుమ్లాగా అభివర్ణించారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు చేపట్టడం ద్వారా పంజాబ్ రెండు రాష్ట్రాల మధ్య మత సామరస్యానికి విఘాతం కలిగించకూడదని హుడా అన్నారు. చండీగఢ్ హర్యానాకు కూడా చెందుతుందని, చండీగఢ్ పరిపాలనలో పంజాబ్, హర్యానాలకు 60:40 ప్రాతినిధ్యం ఉందని ఎత్తి చూపిన హుడా, ఈ విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా పొరుగు రాష్ట్రంపై పోరాడతాయని అన్నారు. పంజాబ్పై ఈ పోరులో ముఖ్యమంత్రికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.
సభను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా మాట్లాడుతూ.. మొహాలీ, ఖరార్లను కూడా హర్యానాలో భాగం చేయాలని షా కమిషన్ సిఫార్సు చేసినప్పటికీ వరుసగా వచ్చిన కేంద్ర ప్రభుత్వాలు దీనిని అంగీకరించలేదని సభ్యులకు గుర్తు చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో కూడా 14 మంది న్యాయమూర్తులు పంజాబ్ లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని ఆయన పేర్కొన్నారు. ‘‘ హర్యానాకు ప్రత్యేక హైకోర్టు ఇవ్వాలి లేదా ప్రస్తుత హైకోర్టులో హర్యానా న్యాయమూర్తుల కోటాను 50 శాతానికి పెంచాలి’’ అని ఆయన అన్నారు.
