Punjab Assembly election 2022 : రెండో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్..
పంజాబ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 23 మంది పేర్లను ప్రకటించింది. ఇప్పటి వరకు 109 అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది.
Punjab Election News 2022 : పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశాయి. ఏ స్థానం నుంచి ఎవరినీ పోటీలోకి దింపాలి ? గెలిచే అభ్యర్థులు ఎవరు ? ఆ స్థానంలో ఆ నాయకుడికి ఉన్న బలమెంత ? వంటి అంశాలను బేరీజు వేసుకుంటున్నాయి. ఇలా లెక్కలు ముగిసిన తరువాత ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది.
పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారాన్ని తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు 109 అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాను ఇటీవల ప్రకటించగా.. రెండో జాబితాను మంగళవారం ప్రకటించారు. ఇందులో 23 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి హర్చరణ్ సింగ్ బ్రార్ కోడలు కరణ్ బ్రార్ (ముక్త్సార్) కూడా ఉన్నారు. మరో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి రాజిందర్ కౌర్ భతల్ అల్లుడు విక్రమ్ బజ్వా సాహ్నేవాల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సహాయకుడు స్మిత్ సింగ్ అమర్గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు.
గత ఎన్నికల్లో ఓడిపోయిన పంజాబ్ మాజీ మంత్రి అశ్వనీ సెఖ్రీని మరోసారి బటాలా స్థానం నుంచి బరిలోకి దింపారు. మాజీ ఎమ్మెల్యే హర్చంద్ కౌర్ను మెహల్ కలాన్ (ఎస్సీ) నియోజకవర్గం నుంచి, రమణజీత్ సింగ్ సిక్కీ ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. భోవా (ఎస్సీ) స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న జోగిందర్ పాల అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఫిరోజ్పూర్ రూరల్, సమ్రాల, అమర్గఢ్, శుత్రానా అసెంబ్లీ స్థానాల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించారు. ముఖ్యంగా ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్వహిస్తున్న పాటియాలా అర్బన్ స్థానానికి పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు అంగద్ సైనీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్ననవాన్షహర్, జలాలాబాద్లకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అమ్రిక్ సింగ్ ధిల్లాన్ స్థానంలో, రాజా గిల్ సమ్రాలా స్థానం నుంచి బరిలోకి దిగారు.
ఇదిలా ఉండగా.. పంజాబ్ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి వెళ్లన్నారు. మొదట కుప్త ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ట్విట్టర్ లో షెడ్యూల్ విడుదల చేశారు. దీని ప్రకారం గురువారం ముందుగా రాహుల్ గాంధీ గోల్డెన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తరువాత 177 మంది అభ్యర్థులతో ప్రచారంలో పాల్గొంటారు. జలంధర్లోని మిథాపూర్ లో చేపట్టనున్న ర్యాలీని ఉద్దేశించి వర్చువల్ గా రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. దాని కంటే ముందు దుర్గియానా ఆలయం, భగవాన్ వాల్మీకి తీర్ స్థల్ వద్ద ఆయన పూజలు చేస్తారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.