మహారాష్ట్రలోని పూణేలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. 

నిర్మాణంలో ఉన్న భ‌వ‌నం కూలిపోవ‌డంతో ఐదుగురు కూలీలు మృతి చెందారు. ఈ విషాద సంఘ‌ట‌న మ‌హారాష్ట్ర (maharastra)లోని పూణే (pune)లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. మ‌రో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్ర‌స్తుతం వారంతా హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై విచారణకు సీనియర్‌ అధికారి నేతృత్వంలో కమిటీ వేయాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు స్థానికులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.  పూణెలోని ఎరవాడ (eravada) ప్రాంతంలోని శాస్త్రినగర్‌ (shastri nagar)లో ఓ భ‌వ‌నం నిర్మిస్తున్నారు. అయితే దాని బేస్‌మెంట్ లెవల్‌ (basement level)లో స్లాబ్‌ను క‌ట్టేందుకు స్టీల్ కడ్డీలతో ఓ నిర్మాణం ఏర్పాటు చేవారు. అయితే గురువారం అర్ధ‌రాత్రి ఒక్క సారిగా కూలిపోయింది. ఆ స‌మ‌యంలో అక్క‌డ కూలీలు ప‌ని చేస్తున్నప్పుడే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దీంతో ఐదుగురు అక్క‌డికక్క‌డే మృతి చెందారు. ఐదుగురు తీవ్ర గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 5) రోహిదాస్ పవార్ (deputy commissioner of police rohidas pawar) తెలిపారు. నిర్మాణం జ‌రుగుతున్న ప్రాంతంలో త‌గిన ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు. 

ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు కూలీలు  మృతి చెంద‌డంతో ఆ భ‌వ‌న కాంట్రాక్ట‌ర్ పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఘ‌ట‌నకు కార‌ణ‌మైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పూణే పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా (pune police commissioner amithab guptha) తెలిపారు. ఈ భ‌వ‌నం పునాదికి ఉన్న స‌పోర్ట్ ఫెయిల్ అయిన‌ట్టు ప్రాథ‌మికంగా నిర్ధారించామ‌ని, పూర్తి వివ‌రాలు తెలుసుకునేందుకు తామే సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుంటున్నామ‌ని పూణే మున్సిపల్ కమిషనర్ తెలిపారు. 

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ (prime minister naredndra modi) సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ‘‘ పుణెలో నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన దుర్ఘటన బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ట్వీట్ (tweet) చేశారు.

ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు  ప్ర‌మాద స్థ‌లానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించారు. ప్రస్తుతం క్షతగాత్రులు హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే సునీల్ టింగ్రే (mla sunil tingre) ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ‘‘ ఈ భవనంలో నిరంతరంగా 24 గంటల పాటు పని నాకు జరుగుతుందని నాకు తెలిసింది అయితే ఇక్క‌డున్న కూలీలు ఎంత స‌మ‌యం నుంచి ప‌ని చేస్తూనే ఉన్నారో మాకు తెలియ‌దు. ప‌ని చేస్తున్న క్ర‌మంలో వారి అలిసిపోయి ఉండ‌వ‌చ్చు. ఇదే ప్ర‌మాదానికి దారి తీసి ఉండ‌వ‌చ్చ‌ని ఇక్క‌డ ఉన్న ఇత‌ర కార్మికులు తెలిపారు. క్షతగాత్రులు అంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వార‌ని నాకు స‌మాచారం ఉంది.’’ అని ఆయ‌న తెలిపారు.