పుదుచ్చేరిలో ద్రవిడియన్ మోడల్ ఉండాలి.. ఇక్కడ గవర్నర్ చెప్పుచేతల్లో సీఎం: ఎంకే స్టాలిన్
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ద్రవిడియన్ మోడల్ పరిపాలన రావాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఇక్కడ గవర్నర్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పుదుచ్చేరిలో ఓ వివాహ వేడుకకు హాజరు కావడానికి వెళ్లారు. అక్కడ పుదుచ్చేరి గవర్నర్ పై ఆరోపణలు చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వాన్ని గవర్నర్ కంట్రోల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం కూడా ద్రవిడియన్ మోడల్ పరిపాలనను ఎంచుకోవాల్సి ఉందని అన్నారు.
డిసెంబర్ 12వ తేదీన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి వెళ్లారు. అక్కడ సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని, కానీ, ఆ ప్రభుత్వం ప్రజల కోసం పని చేయడం లేదని ఆరోపించారు. పుదుచ్చేరి సీఎం ఆకారంలో పెద్దగా పొడుగ్గా ఉన్నారని, కానీ, ఒక తోలు బొమ్మలా ఆడుతున్నాడని అన్నారు. తాను ఆయనను తప్పు పట్టడం లేదని, ఆయన మంచి వ్యక్తి అని తెలిపారు. కానీ, ఆ మంచి మనిషి కి కూడా శౌర్యం ఉండాలి కదా అని వివరించారు.
Also Read: ఇక వికలాంగులందరికీ త్వరలో వర్క్ ఫ్రం హోం అవకాశం - తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక ప్రకటన
త్వరలోనే ఇక్కడ ద్రవిడ మున్నెట్ర కజగం కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. పుదుచ్చేరి సీఎంను గవర్నర్ కంట్రోల్ చేస్తున్నారని, ఇది సిగ్గు చేటు అని తెలిపారు. పుదుచ్చేరిలో మతపరమైన ప్రభుత్వం రాకుండా జాగ్రత్తపడాలని వివరించారు.