నూపుర్ శర్మ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో గురువారం చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు రోడ్లపై ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. టైర్లను తగలబెట్టారు. దీంతో సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకురాలి వ్యాఖ్యలపై కలత చెందితే ఢిల్లీకెళ్లి ఆందోళన చేయాలని, అంతేగాని పశ్చిమ బెంగాల్ లో విధ్వంసం సృష్టించకూడదని తెలిపారు.
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల ప్రభావం ఇంకా చల్లారడం లేదు. దేశ వ్యాప్తంగా ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ పశ్చిమ బెంగాల్లోని హౌరాలో గురువారం నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు 116వ నెంబరు జాతీయ రహదారిపై రచ్చ రచ్చ చేశారు. రోడ్లపై ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. వీధుల్లోకి వచ్చి టైర్లను తగలబెట్టారు. మహమ్మద్ ప్రవక్తపై కామెంట్స్ ను నిరసిస్తూ నినాదాలు చేశారు.
ఈ ఆందోళనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ నిరసనలు తీవ్రంగా ఖండించారు. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో కలత చెందిన వారు ఢిల్లీకి వెళ్లి ప్రధాని రాజీనామా కోసం డిమాండ్ చేయాలని సూచించారు. ‘‘ ఇలాంటి హింసాత్మక నిరసనకు నేను మద్దతు ఇవ్వబోను. మీరందరూ అంత కోపంగా ఉంటే ఢిల్లీకి వెళ్లి శాంతియుతంగా నిరసన తెలపండి. అలాగే ప్రధాని రాజీనామాను డిమాండ్ చేయండి. మీరు ఇక్కడ ఎందుకు మరో కొత్త సమస్యను సృష్టిస్తున్నారు? మీరందరూ శాంతిని కాపాడాలని, నిరసనను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను ’’ అని సీఎం పేర్కొన్నారు.
‘‘ కొందరు వినాశకరమైన బీజేపీ నాయకుల ఇటీవలి హేయమైన, దారుణమైన ద్వేషపూరిత ప్రసంగ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను.. బీజేపీ తీరుతో హింస వ్యాప్తి చెందడమే కాకుండా దేశ విభజన దారీతీసేలా.. శాంతికి విఘాతం కలిగిస్తుంది. దేశ సమైక్యతకు భంగం కలగకుండా, ప్రజలు మానసిక వేదనకు గురికాకుండా ఉండేందుకు బీజేపీకి చెందిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని నేను గట్టిగా కోరుతున్నాను ’’ అని మమతా బెనర్జీ అన్నారు.
బీజేపీ నేతలను కుక్కలతో పోల్చిన సిద్దా రామయ్య.. వివాదంలో పడిన కర్ణాటక మాజీ సీఎం
జ్ఞాన్ వ్యాపి మసీదు, శివలింగం అంశంపై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్ లో నూపుర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింల అరాధ్యుడైన మహ్మద్ ప్రవక్తపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో దాదాపు 1500 మందిపై కేసులు నమోదు అయ్యాయి. నూపుర్ శర్మ వ్యాఖ్యలపై గల్ప్ కంట్రీస్ కూడా భారత్ పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబారులను పిలిచి వివరణ అడిగాయి. దీంతో ఆ వ్యాఖ్యలు భారతదేశ అభిప్రాయాలు ఏమాత్రం కావని తెలియజేశారు. ఇతర ముస్లిం దేశాలు కూడా నూపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండించాయి.
