చారిత్రాత్మక నగరం పూణేలో నివాసముంటున్న సామాన్యుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు నిర్మిస్తున్న మెట్రోను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు.
పూణే: మహారాష్ట్ర లోని పూణే నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెట్రోను ఇవాళ(ఆదివారం) ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) ప్రారంభించారు. మొత్తం 32.2 కిలోమీటర్ల పూణే మెట్రో (pune metro)లో ఇప్పటికే పూర్తయిన 12కి.మీ మార్గంలో మెట్రో ప్రయాణం మొదలయ్యింది. స్వయంగా ప్రధాని టికెట్ కొనుక్కుని మరీ చిన్నారులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు.
పూణే మెట్రోలో తన ప్రమాణానికి సంబంధించిన ఫోటోలను ప్రధాని సోషల్ మీడియా వేదికన పంచుకున్నారు. ''నా యువ మిత్రులతో కలిసి పూణే మెట్రోలో ప్రయాణం'' అనే క్యాప్షన్ కు మెట్రో ప్రయాణం ఫోటోలను జతచేసి పీఎం మోదీ ట్వీట్ చేసారు.
గతంలో 26డిసెంబర్ 2016లో ప్రధాని మోదీ చేతులమీదుగానే పూణే మెట్రో శంకుస్థాపన జరిగింది. మొత్తం 32.2 కిలోమిటర్లు మెట్రో నిర్మాణాన్ని రూ.11,400కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులోభాగంగా ఇప్పటివరకు పూర్తయిన 12కిలోమీటర్ల దూరాన్ని ప్రధాని ప్రారంభించారు.

ఇదిలావుంటే మరో 100 ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు పూణేలో రోడ్డెక్కాయి. ప్రస్తుతం పూణేలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఈ ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. బస్సుల చార్జింగ్ కోసం ఏర్పాటుచేసిన ఛార్జింగ్ స్టేషన్ను కూడా పీఎం ప్రారంభించారు.
Video
పూణేలో ఇప్పటికే 150 ఒలెక్ట్రా బస్సులు విజయవంతంగా నడుస్తుండగా వీటికి తాజాగా మరో 100 తోడయ్యాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతోంది ఒలెక్ట్రా. సూరత్, ముంబై, పూణే, సిల్వాసా, గోవా, నాగ్పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్లలోనూ ఓలెక్ట్రా బస్సులు నడుస్తున్నాయి. కాలుష్య రహిత, శబ్దం లేని ఏసీ ప్రయాణం, భద్రతకు పెద్దపీట ఒలెక్ట్రా బస్సుల ప్రత్యేకత.
మరిన్ని బస్సులు పూణే రోడ్లపైకి వచ్చిన సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఎండీ కె.వి. ప్రదీవ్ మాట్లాడారు. పూణే నగరం వారసత్వ పటంలో ఒలెక్ట్రా బస్సులకు ప్రత్యేక స్థానం వుందన్నారు.పూణేలో ఇప్పటివరకు 2కోట్ల కిలోమీటర్లకు పైగా తమ బస్సులు తిరిగాయన్నారు. లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీ ఒక ఛార్జ్తో 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ఎండీ పదీవ్ వెల్లడించారు.
