ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ముర్ము.. హాజరైన నడ్డా, చంద్రబాబు, పురందేశ్వరి..
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం ముద్రించిన రూ. 100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ సార్మక నాణేం విడుదల కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుమార్తె, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన 20 నిమిషాల నిడివి గల వీడియో ప్రదర్శన ఇస్తారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ముద్రించిన రూ. 100 స్మారక నాణాన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్తో నాణెం తయారు చేశారు. హైదరాబాద్ మింట్ కాంపౌడ్లో ఈ నాణేన్ని రూపొందించారు.
దూరంగా జూనియర్ ఎన్టీఆర్..
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండిపోయారు. దేవర షూటింగ్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టుగా సమాచారం. ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నప్పటికీ.. దేవర షూటింగ్ నిమిత్తం హైదరాబాద్లో ఉండాల్సి రావడంతో ఢిల్లీ వెళ్లలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.