ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ జిల్లా దేవరఖ్‌ఘాట్ వద్ద ఇసుకలో  పదుల సంఖ్యలో మృతదేహాలు బయటపడడం కలకలం రేపుతోంది. 

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ జిల్లా దేవరఖ్‌ఘాట్ వద్ద ఇసుకలో పదుల సంఖ్యలో మృతదేహాలు బయటపడడం కలకలం రేపుతోంది. గతంలో కూడ ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు బీహార్ రాష్ట్రాల్లో ఇదే తరహాలో పెద్ద మొత్తంలో మృతదేహాలు బయటపడడం కలకలం రేపుతోంది. తాజాగా ప్రయాగ్‌రాజ్ జిల్లాలో బయటపడిన మృతదేహాలు కరోనాతో మరణించినవారివేననే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. అయితే ఈ విషయమై అధికారుల నుండి ఎలాంటి స్పష్టత రాలేదు. 

also read:గంగానదిలో మృతదేహాలు: కేంద్రానికి ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు

స్మశానవాటికల్లో ఖాళీ లేకపోవడంతో పాటు అంత్యక్రియల ఖర్చు పెరగడం వంటి కారణాలతో గంగా నది ఒడ్డున ఉన్న ఇసుకలో మృతదేహాలను పూడ్చి పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. బట్టల్లో మృతదేహాలను చుట్టి ఇసుకలో పూడ్చిపెట్టినట్టుగా స్థానికులు చెబుతున్నారు. మృతదేహాల వద్ద మందులు, మందుల చీటీలు లభ్యమైనట్టుగా స్థానికులు చెబుతున్నారు. ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని పఫామౌ ఘాట్ లో కరోనా మృతదేహాలను ఖననం చేస్తున్నట్టుగా ఐజీ కెపి సింగ్ చెప్పారు. కరోనాతో మరణించినవారి మృతదేహాలను ఇసుకలో ఖననం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. గంగా నది ఒడ్డున డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిని మోహరించినట్టుగా ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో మృతదేహాలను పూడ్చకుండా వారు కాపలాగా ఉన్నారని ఆయన చెప్పారు.