కాంగ్రెస్లోకి ప్రశాంత్ కిశోర్ .. ఢిల్లీ వర్గాల్లో ఊహాగానాలు..?
కాంగ్రెస్ లేకుండా 2024 ఎన్నికల్లో బీజేపీని అధికారం దించడం సాధ్యపడదని పవార్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ వంటి వారు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేతలతో పీకే భేటీ అయ్యారన్న వాదనలు కూడా ప్రచారం జరుగుతోంది.
దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ ఓ హాట్ టాపిక్గా మారారు. 2024 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ఆయన బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్నామధ్య ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. తాజాగా నిన్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ వాద్రాతో మంగళవారం భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది.
కాంగ్రెస్ అగ్రనేతలతో ప్రశాంత్ కిశోర్ భేటీపై కాంగ్రెస్లోని ఓ సీనియర్ నేత మాట్లాడుతూ.. ‘ఎన్నికల వ్యూహాలకు మించిన చర్చలు జరిగి ఉంటాయి’ అని అన్నట్లు ఓ జాతీయ మీడియా ఛానెల్ పేర్కొంది. దీంతో ఆ చర్చలు పీకే కాంగ్రెస్ చేరికపైనే అయి ఉంటాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది జరిగే ఉత్తర్ప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తొలుత అంతా భావించారు. కానీ, అంతకంటే ప్రధానమైన అంశాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read:వేడెక్కిన హస్తిన: రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిషోర్ భేటీ..!
మరోవైపు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్తో గతనెల 11న ముంబయిలో ప్రశాంత్ కిశోర్ (పీకే) తొలిసారి భేటీ అయిన విషయం తెలిసిందే. మళ్లీ 21న ఢిల్లీలోనూ ఆయన్ను కలిశారు. దాదాపు 3 గంటల పాటు వారిద్దరూ ఏకాంతంగా సమాలోచనలు జరిపారు. అంతకు ముందురోజే 8 విపక్ష పార్టీల నేతలు పవార్తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లేకుండా 2024 ఎన్నికల్లో బీజేపీని అధికారం దించడం సాధ్యపడదని పవార్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ వంటి వారు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేతలతో పీకే భేటీ అయ్యారన్న వాదనలు కూడా ప్రచారం జరుగుతోంది.