Prashant Kishor: కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు.. ముఖ్యనేతలతో పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కావడంతో ఈ వార్తలకు మరింత ఊతం వచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, రెండేళ్ల తర్వాతి సార్వత్రిక ఎన్నికల వ్యూహరచన గురించి చర్చించినట్టు సమాచారం.
Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించనున్నారంటే.. అవుననే సమాధానం వస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు, ఈ మేరకు తేదీలు కూడా ఖాయమైనట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ లో చేరికపై గత రెండు, మూడు నెలలుగా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పలు మార్లు భేటీ అయ్యారు. ఈ తరుణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు.
సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎంపీ రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే తదితర నేతలు కూడా పాల్గొన్నారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరుతున్నారనే ఊహాగానాలను మరింత ఊతం వచ్చింది. ప్రశాంత్ కిషోర్ తో భేటీ కావడానికి స్వయంగా పార్టీ అధినేత్రి పిలువడం మరో ఆసక్తికర అంశం. ప్రశాంత్ కిషోర్ చేరికను పార్టీ అధిష్టానం స్వాగతిస్తోన్నట్టు సమాచారం
ఈ భేటీలో ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఓటమితో సహా అనేక ఇతర కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రధానంగా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలి.. ఈ మేరకు అనుసరించాల్సిన వ్యూహాలేంటీ అనే విషయాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గుజరాత్తో పాటు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల బ్లూప్రింట్పై కూడా చర్చించినట్టు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా.. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు చర్చించేందుకే సోనియాతో పీకే భేటీ అయ్యారనే వాదన వినిపిస్తోంది. అయితే పీకే మాత్రం గుజరాత్ ఎన్నికలకు మాత్రమే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పీకే శిష్యుడైన మరో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు(ఎస్కే) ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరడం తెలిసిందే. అయితే సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ లో చేరగా, పీకే కూడా కార్యకర్తగానే చేరుతారా, లేక కార్యదర్శి హోదాలోనే ఎంట్రీ ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది.కాగా తన రాజకీయ భవిష్యత్తుపై మే 6లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రశాంత్ కిషోర్ ఇదివరకే ప్రకటించగా.. ఆలోపే కాంగ్రెస్లో చేరికపై స్పష్టత రానుంది.
