బెంగళూరులోని మూడు డ్యాన్స్ బార్‌లలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం అందగానే పోలీసులు తనిఖీలు చేశారు. ఇందులో కస్టమర్ల ముందు మహిళలను బలవంతంగా డ్యాన్స్ చేయిస్తున్నారని ఫిర్యాదు అందిందని, తనిఖీలు చేసి 87 మంది మహిళలను రక్షించామని, 210 మంది కస్టమర్లపై కేసు నమోదైందని వివరించారు. తొమ్మిది మంది ఓనర్లు, మేనేజర్లను అరెస్టు చేసినట్టు తెలిపారు. 

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో డ్యాన్స్ బార్‌లలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. సిటీ పోలీసులకు చెందిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. బెంగళూరులోని మూడు డ్యాన్స్ బార్‌లలో తనిఖీలు చేశారు. ఈ డ్యాన్స్ బార్‌లను నిర్వహిస్తున్న మేనేజర్లు, ఓనర్లు తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కస్టమర్ల ముందు బలవంతంగా డ్యాన్స్ చేసేలా ఒత్తిళ్లకు గురైన 87 మంది మహిళలను పోలీసులు రక్షించారు. అలాగే, 210 మంది కస్టమర్లపైనా కేసులు నమోదయ్యాయి.

తమకు అందిన ఫిర్యాదుల మేరకు ఆ డ్యాన్స్ బార్‌లపై తనిఖీలు నిర్వహించినట్టు పోలీసులు వివరించారు. అక్కడ చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. బార్‌లలో లైవ్ బ్యాండ్స్ ప్లే చేస్తున్నారని, కస్టమర్ల ముందు మహిళలను డ్యాన్స్ చేసేలా బలవంతం చేస్తున్నారని వివరించారు.

Also Read: కర్ణాటక ఎమ్మెల్సీ బైపోల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా జగదీశ్ షెట్టర్.. లింగాయత్ లీడర్‌ గెలుపు ఖరారు!

ఈ ఫిర్యాదు అందిన నేపథ్యంలోనే తాము రైడ్ చేశామని వివరించారు. వీకెండ్‌లో ఈ బార్‌లకు చెందిన మొత్తం తొమ్మిది మంది ఓనర్లు, మేనేజర్లను అరెస్టు చేసినట్టు తెలిపారు.

ఈ బార్‌లలో డ్యాన్స్‌లు చేయడానికి మహిళలను దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడకు తీసుకు వచ్చారని పోలీసులు తెలిపారు. అందులో కొందరు విదేశాలకు చెందిన మహిళలూ ఉన్నట్టు వివరించారు. ఈ కేసు ను పోలీసులు విచారణ జరుపుతున్నట్టు వివరించారు.