ప్రధాని భద్రతా లోపంపై ఏర్పాటైన విచారణ కమిటీ చైర్పర్సన్ Judge Indu Malhotraకు బెదిరింపులు
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటలో చోటుచేసకుున్న భద్రతా లోపంపై (PM Modi security breach) సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ చైర్పర్సన్గా ఉన్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తికి ఇందు మల్హోత్రాకు (Indu Malhotra) బెదిరింపులు వచ్చాయి.
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటలో చోటుచేసకుున్న భద్రతా లోపంపై (PM Modi security breach) సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ చైర్పర్సన్గా ఉన్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తికి ఇందు మల్హోత్రాకు (Indu Malhotra) బెదిరింపులు వచ్చాయి. జస్టిస్ ఇందు మల్హోత్రాకు ఖలిస్తాన్ వేర్పాటువాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) బెదిరింపులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్లను ఆ సంస్థ విడుదల చేసింది. ప్రధాని మోదీ భద్రతా ఉల్లంఘనపై విచారణకు తాము అనుమతించబోమని దుండగులు పేర్కొన్నారు. విచారణ చేయవద్దంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రధాని భద్రతా లోపం కేసుకు దూరంగా ఉండాలని కమిటీ ఛైర్మన్ను బెదిరించినట్లు ఆడియోలో ఉంది.
ప్రధాన భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి.. రిటైర్డ్ జడ్జి ఇందు మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విచారణలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు, పంజాబ్ పోలీసులు విచారణలో భాగం కానున్నారని వెల్లడించింది. ఈ కమిటీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, చంఢీఘర్ పోలీస్ చీఫ్, డైరెక్టర్ జనరల్ (సెక్యూరిటీ) ఆఫ్ పంజాబ్, పంజాబ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సభ్యులుగా ఉండనున్నారు. జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలోని విచారణ కమిటీ.. భద్రతా ఉల్లంఘనకు కారణమేమిటో, ఎవరు బాధ్యులు, భవిష్యత్తులో ఇటువంటి లోపాలను నివారించడానికి ఎలాంటి రక్షణలు అవసరమో విచారించి.. నివేదికను వీలైనంత త్వరగా సమర్పిస్తుందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది.
ప్రధాని మోదీ భద్రతా వైఫ్యత్యానికి సంబంధించి.. ఇదివరకే పలువురు సుప్రీంకోర్టు జడ్జిలను ఎస్ఎఫ్జే సంస్థ బెదిరించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోవడానికి కారణం తామేనంటూ సిక్స్ ఫర్ జస్టిస్ చెప్పుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించి సిక్స్ ఫర్ జస్టిస్ నుంచి తమకు ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం తెలిపింది.
మోదీ కాన్వాయ్ రోడ్డుపై నిలిచిపోవడానికి కారణం తామేనని, భద్రతా వైఫల్యాలపై జరుగుతున్న దర్యాప్తును నిలిపివేయాలని, ఈ ఘటనపై ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిల్పై విచారణ జరపవద్దని న్యాయవాదులను బెదిరించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. న్యాయవాదుల సంఘం పేర్కొన్న ప్రకారం.. అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ ఆఫ్ సుప్రీంకోర్టు సభ్యులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రికార్డెడ్ ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇందుకు సంబంధించి కొందరు సుప్రీం కోర్టు లాయర్లు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది వినీత్ జిందాల్ SFJ వ్యవస్థాపకుడిపై ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేష్ అస్థానా , సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ప్రకటనలు మరియు చర్యలు భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను సవాలు చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక, ఇటీవల Sikhs For Justice రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో భారత త్రివర్ణ పతాకానికి బదులుగా ఖలిస్తానీ జెండాలను ఎగురవేసే ఎవరికైనా ఒక మిలియన్ డాలర్ల రివార్డును బహుమతిగా అందజేస్తామని ప్రకటన చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మార్గాన్ని అడ్డుకోవాలని, జనవరి 26న దేశ రాజధాని నుంచి త్రివర్ణ పతాకాన్ని తొలగించాలని దాని మద్దతుదారులను కోరింది. ఈ విధంగా రివార్డులు ప్రకటించడం ద్వారా న్యూఢిల్లీలో శాంతియుత కార్యకలాపాలకు విఘాతం కలిగించేందుకు నిషేధిత ఉగ్ర సంస్థ ప్రయత్నాలు చేస్తుంది.