అయోధ్య రామ మందిరానికి మార్చి వరకు వెళ్లొద్దు: కేంద్రమంత్రులకు ప్రధాని విజ్ఞప్తి
అయోధ్య రామ మందిరానికి మార్చి నెల వరకు కేంద్ర మంత్రులు వెళ్లవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించినట్టు తెలిసింది. అయోధ్యలో రద్దీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్రమంత్రులు సందర్శనకు వెళ్లితే వీఐపీ ప్రోటోకాల్ వల్ల భక్తులకు ఇక్కట్టు ఎక్కువ అవుతాయని, అందుకే మార్చి నెలలో అయోధ్య సందర్శనకు ప్లాన్ వేసుకోవాలని సూచించారు.
![pm narendra modi urges union ministers not to visit ayodhya ram mandhir atleast till march kms pm narendra modi urges union ministers not to visit ayodhya ram mandhir atleast till march kms](https://static-ai.asianetnews.com/images/01hmt2ypr10e5zmnwyeckg5src/capture_363x203xt.jpg)
Ayodhya: అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మరుసటి రోజు నుంచే అంటే జనవరి 23వ తేదీ నుంచే సాధారణ ప్రజలకు అయోధ్య రాముడి దర్శనానికి అవకాశం వచ్చింది. దీంతో లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్య రామ మందిరం ముందు బారులు తీరారు. ఒక్క రోజే ఐదు లక్షల మంది అయోధ్య రాముడిని సందర్శించుకున్నారు. ఇప్పటికీ రద్దీ తీవ్రంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సభ్యులకు కీలక విజ్ఞప్తి చేశారు.
అయోధ్యలో తీవ్రంగా రద్దీ ఉన్నందున కేంద్ర మంత్రులను ఇప్పుడే అయోధ్యకు వెళ్లవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనలు చేశారు. కనీసం మార్చి నెల వరకైనా అయోధ్యకు వెళ్లే ప్లాన్లను వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే అయోధ్యలో రద్దీ ఎక్కువగా ఉన్నదని, దానికి తోడు కేంద్రమంత్రులు వెళ్లితే వీఐపీ ప్రోటోకాల్తో అక్కడ దర్శనం మరింత కష్టతరంగా మారిపోతుందని సూచించినట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాబట్టి, మార్చి నెలలోనే కేంద్ర మంత్రులు అయోధ్య రామ మందిరాన్ని సందర్శించే ప్రణాళికలు వేసుకోవాలని ప్రధాని సూచించినట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
Also Read : Janasena: జనసేనలోకి పృధ్వీరాజ్.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్
కాగా, ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కూడా వీఐపీల విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యకు వచ్చే వీఐపీలు కనీసం వారం రోజులు ముందుగానే సమాచారం తెలియజేయాలని పేర్కొన్నారు. యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులకైనా ఈ సమాచారం ఇవ్వాలని, ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.