భారత్కు ఆస్కార్, నారీ శక్తి, అవయవదానం: ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’లో కీలక అంశాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు తన 99వ మన్ కీ బాత్ కార్యక్రమంలో నారీ శక్తి గురించి మాట్లాడారు. భారత తొలి లోకో పైలట్ సురేఖా యాదవ్, భారత్కు ఆస్కార్ తెచ్చిన గునీత్ మోంగా, కార్తికి గొంజాల్వేజ్లను ప్రస్తావించారు. అవయవదానం గురించీ మాట్లాడారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం 11 గంటలకు తన 99వ ఎడిషన్ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళా శక్తి గురించి, భారత్కు ఆస్కార్ సాధించిన ఇద్దరు మహిళలు, అవయవదానంపై అవగాహన పెరగడం, క్లీన్ ఎనర్జీపై ముందడుగు గురించి ప్రధానంగా మాట్లాడారు.
అవయవదానం గురించి మాట్లాడుతూ అమృత్సర్కు చెందిన ఓ కుటుంబంతో ఆయన మాట్లాడారు. మన దేశంలో అవయవదానం గురించి అవగాహన పెరిగిందని వివరించారు. అమృత్సర్కు చెందిన దంపతులు ప్రాణాంతక కండీషన్తో జన్మించి 39 రోజుల తర్వాత మరణించిన తమ బిడ్డ అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ దంపతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. వారు అవయవదానం నిర్ణయం తీసుకోవడాన్ని ప్రశంసించారు. 2013లో మన దేశంలో అవయవదానం 5,000 సార్లు జరిగిందని, అదే 2022లో ఈ సంఖ్య 15,000కు పెరిగిందని వివరించారు.
భారత పురోగతిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నారీ శక్తి ప్రబలంగా పుంజుకుందని వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఏసియాలోనే తొలి మహిళా లోకో పైలట్గా రికార్డు సృష్టించిన సురేఖా యాదవ్ను ప్రస్తావించారు. నాగాల్యాండ్లో 75 ఏళ్లలో తొలిసారి ఇద్దరు మహిళలు శాసన సభకు ఎన్నికయ్యారని వివరించారు. అంతేకాదు, యూఎన్ మిషన్ కింద పీస్ కీపింగ్ కోసం కేవలం మహిళా ప్లటూన్నూ ఏర్పాటు చేశామని తెలిపారు.
Also Read: అమరుడైన నా తండ్రిని అవమానించారు.. ఆయన కొడుకును మీర్ జాఫర్ అని పిలిచారు: బీజేపీపై ప్రియాంక ఫైర్
గ్రూప్ కెప్టెన్ శైలిజా ధామి కంబాట్ యూనిట్లో కమాండ్ అపాయింట్మెంట్ పొందిన తొలి మహిళా వైమానిక దళ అధికారిణిగా రికార్డు సృష్టించారని వివరించారు.
ది ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమా దర్శక, నిర్మాతలు కార్తికీ గొంజాల్వేజ్, గునీత్ మోంగాల గురించి ప్రధాని మోట్లాడారు. ఈ నెలలోనే వారిద్దరు ఆస్కార్ అవార్డులను భారత్కు తెచ్చారని వివరించారు. సోలార్ ఎనర్జీలో భారత్ శరవేగంగా దూసుకుపోతున్నదని, దీనిపై ప్రపంచమంతా భారత్ను కీర్తిస్తున్నారని అన్నారు. డయ్యూ జిల్లాలో రోజంతా సౌర శక్తి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుచ్ఛక్తినే వాడుతున్నారని వివరించారు.