రైతుల పక్షాన నిజంగా నిలబడితే.. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాతో వేదిక పంచుకోవద్దు: ప్రధానికి ప్రియాంక గాంధీ లేఖ
సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన రోజే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఓ సవాల్ విసిరారు. ప్రధాన మంత్రి నిజంగా రైతుల పక్షాన నిలబడితే ఉత్తరప్రదేశ్లో నిర్వహిస్తున్న డీపీజీ సదస్సులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాతో వేదిక పంచుకోవద్దని ఓ లేఖ రాసి కోరారు. లఖింపూర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటనలో ఆందోళన చేస్తున్న రైతులపైకి మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు.
న్యూఢిల్లీ: Farmers ఏడాదిగా పోరాడుతున్న డిమాండ్కు శిరసావహిస్తూ ప్రధాన మంత్రి Narendra Modi మూడు వ్యవసాయ చట్టాల(Farm Laws)ను రద్దు(Repeal) చేస్తామని నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. సాగు చట్టాల రద్దు ప్రకటన వెలువడిన తర్వాతి రోజే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ప్రధాన మంత్రికి సవాల్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజంగా రైతుల పక్షాన నిలబడితే.. రైతు ప్రయోజనాలపై ఆయన ఉద్దేశాలు సరైనవే అయితే.. లఖింపూర్ ఖేరి(Lakhimpur Kheri) ఘటనలో నిందితుడిగా ఉన్న అశిశ్ మిశ్రా తండ్రి.. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా(Ajay Mishra)తో వేదిక పంచుకోవద్దని లేఖ రాశారు. అంతేకాదు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో డీజీపీ సదస్సులో హాజరు కాబోతున్నారు.
లఖింపూర్ ఖేరి ఘటనలో దారుణంగా మనుషులను చంపేసిన ఘటన దేశమంతా తెలుసు అని, రైతులను కారుతో తొక్కి చంపిన ఘటనలో ప్రధాన నిందితుడు కేంద్ర మంత్రివర్గ సభ్యుడు అజయ్ మిశ్రా కుమారుడేనని తమకు తెలుసు కూడా అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనలో న్యాయాన్ని తొక్కి పెట్టడానికి ఉత్తర ప్రదేశ్ మొదటి నుంచీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నదని ఆరోపించారు. అందుకే సుప్రీంకోర్టు కూడా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై సీరియస్ అయిందని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వ్యవహార శైలిని చూస్తే ఈ కేసులో ఓ నిందితుడిని కాపాడాలని ప్రయాస పడుతున్నట్టు సందేహాలు వస్తున్నాయని సుప్రీంకోర్టు తెలిపిందని వివరించారు. అంతేకాదు, తాను లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులను కలిశారని, వారు కేవలం న్యాయం మాత్రమే కోరుతున్నారని తెలిపారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నందున వారికి న్యాయం దక్కుతుందనే ఆశ సన్నగిల్లుతున్నదని పేర్కొన్నారు. కాబట్టి, కేంద్ర మంత్రిని వెంటనే డిస్మిస్ చేసి రైతు కుటుంబాలకు న్యాయం జరగాలని కోరుతున్నట్టు వివరించారు.
Also Read: Farm Laws: పంజాబ్, యూపీలో బీజేపీకి లైన్ క్లియర్!.. విపక్షాలకు నష్టమే?.. ‘మోడీ తరహా నిర్ణయం కాదిదీ’
మరో మూడు నెలల్లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బరిలోకి కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ సారథ్యంలోనే దిగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుడుచుకుపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ సారైన తన బలమైన ఉనికి చూపెట్టాలని ప్రయత్నిస్తున్నది.
సాగు చట్టాలపై ఏడాది కాలంగా చేస్తున్న రైతు పోరాటాల్లో ఉత్తరప్రదేశ్ పశ్చిమ జిల్లాల నుంచీ పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. యూపీలోనూ రైతు ధర్నాకు మంచి మద్దతు ఉన్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేస్తామన్న ప్రకటన చేసింది. రైతులందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా క్షమాపణలు చెప్పారు.
Also Read: Farm Laws: మన దేశంలో చట్టాన్ని ఎలా రద్దు చేస్తారో తెలుసా?
కాగా, ఈ విజయాన్ని ప్రతిపక్షాలు తమ విజయంగా మార్చుకునే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్, యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో రైతులను తమ వైపు మలుపుకోవడానికి కసరత్తులు చేస్తున్నాయి. రైతు ధర్నాతో పాటు ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతు ఆందోళనల మీదకు కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనపైనా కాంగ్రెస్ గట్టి పోరాటం చేస్తున్నది. లఖింపూర్ ఖేరి ఘటనలు ఎనిమిది మంది మరణించారు. ఇందులో నలుగురు రైతులు ఉన్నారు. రైతుల పై నుంచి దూసుకెళ్లిన ఓ కారు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా పేరు మీద ఉన్నది. ఈ ఘటనకు పాల్పడిన వారిలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిశ్ మిశ్రా ఉన్నాడని రైతులు ఆరోపణలు చేశారు.