బిషప్లతో ప్రధాని మోడీ భేటీ.. క్రైస్తవులకు రక్షణ కల్పిస్తామంటూ హామీ
Thiruvananthapuram: కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి బిషప్ లతో భేటీ అయ్యారు. వివిధ క్రిస్టియన్ సంస్థల అధిపతులతో సమావేశమైన ప్రధాని.. దేశంలో ఉన్న క్రైస్తవుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
![PM Narendra Modi meets Kerala Bishops; Guaranteed to protect Christians RMA PM Narendra Modi meets Kerala Bishops; Guaranteed to protect Christians RMA](https://static-ai.asianetnews.com/images/01gyw60z2csgywpd4n2q0zwvqc/modi-jpeg_363x203xt.jpg)
PM Modi Meets Top Bishops: కేరళ బిషప్ లతో భేటీలో క్రైస్తవులకు రక్షణ కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా అక్కడి బిషప్ లతో సమావేశమైన ప్రధాని దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్రిస్టియన్ కమ్యూనిటీపై జరుగుతున్న దాడులపై చర్చించారు. వారి రక్షణకు హామీ ఇచ్చారు.
వివరాల్లోకెళ్తే.. ప్రధాని నరేంద్ర మోడీ కేరళ బిషప్ లతో సమావేశమై క్రిస్టియన్ కమ్యూనిటీకి రక్షణ కల్పించారు. వెరాపోలీలోని రోమన్ కాథలిక్ ఆర్చిబిషప్ జోసెఫ్ కలతిపరంబిల్, నానయా చర్చి ఆర్చ్ బిషప్ మాథ్యూ మూలక్కాట్, క్నానాయా జాకోబైట్ ఆర్చ్ బిషప్ కురియాకోస్ మార్ సెవెరియోస్, చాల్డియన్ సిరియన్ చర్చి మెట్రోపాలిటన్ మార్ అవ్గిన్ కురియాకోస్ వంటి సీనియర్ మతాధికారులతో ప్రధాని సమావేశం జరిగిందని కేరళలోని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన క్రిస్టియన్ మత పెద్దలు ఉన్నారు.
రైతులు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలతో సహా వివిధ సమస్యలపై చర్చించిన ప్రధాని మోడీతో సమావేశం హృదయపూర్వక అనుభవం అని ఆర్చ్ బిషప్ జోసెఫ్ కలతిపరంబిల్ అన్నారు. దళితుల గురించి కూడా మాట్లాడామని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్రిస్టియన్ కమ్యూనిటీపై జరుగుతున్న దాడులపై బిషప్ లు ఆందోళన వ్యక్తం చేశారనీ, ప్రధాని రక్షణకు చర్యల విషయంపై హామీ ఇచ్చారని సంబంధిత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అన్ని మతాలకు చెందిన వారికి రక్షణ కల్పిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని సమాచారం.
ఈ సమావేశంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా కేరళలో పర్యటిస్తున్నారు. తొలిరోజు కొచ్చిలో భారీ రోడ్ షో నిర్వహించి రాష్ట్రంలో తొలి వందేభారత్ రైలును ప్రారంభించారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో విద్యార్థులతో ప్రధాని మోడీ...
తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ నుంచి కేరళలోని వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులతో ముచ్చటించారు. రైలులో ఉన్న విద్యార్థులు తమ పెయింటింగ్ లను ప్రధాని మోడీ ముందు ప్రదర్శించడం కనిపించింది. ప్రధాని కొన్ని చిత్రాలపై సంతకాలు కూడా చేశారు. ఈ హైస్పీడ్ రైలు తిరువనంతపురం- కాసర్ గఢ్ మధ్య నడుస్తుంది. వందే భారత్ రైలు ముఖ్యంగా తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ వంటి 11 ప్రాంతాలను కవర్ చేస్తుంది.