Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ ఎంపీ ఆఫీసుపై ఐటీ దాడులు .. బీరువాల్లో బయటపడ్డ వందల కోట్లు , ప్రతి పైసా తిరిగి ఇవ్వాల్సిందే: మోడీ

జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు నివాసం, కార్యాలయంలో జరిగిన ఐటీ దాడుల్లో రూ.200 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న ఘటన కలకలం రేపింది.  ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

PM Narendra Modi Blasts Congress After Rs 200 Crore Cash Found at It raid on Rajya Sabha MP Dhiraj Sahu office ksp
Author
First Published Dec 8, 2023, 4:29 PM IST

జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు నివాసం, కార్యాలయంలో జరిగిన ఐటీ దాడుల్లో రూ.200 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న ఘటన కలకలం రేపింది.  ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రజలు ముందు కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్లను చూడాలని, ఆ తర్వాత ప్రతిపక్ష నేతల ప్రసంగాలు వినాలంటూ చురకలంటించారు. దేశప్రజలు ఈ నోట్ల కుప్పను చూసి ఆ తర్వాత తమ నాయకుల నిజాయితీతో కూడిన ప్రసంగాలు వినాలి.. ప్రజల నుంచి దోచుకున్న ప్రతి పైసా తిరిగి ఇవ్వాల్సిందే, ఇదే మోదీ హామీ’’ అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. 

ఒడిశా , జార్ఖండ్‌లలోని బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఆదాయపు పన్ను శాఖ గురువారం దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీ కార్యాలయంలో భారీగా నగదును స్వాధీనం చేసుకుంది. ఇంతమొత్తంలో నగదు దొరకడంతో దానిని లెక్కించేందుకు ఐటీ శాఖ పెద్ద సంఖ్యలో కౌంటింగ్ మిషన్లను ఆర్డర్ చేయాల్సి వచ్చింది. ఒడిశాలోని బోలంగీర్‌, సంబల్‌పూర్‌, జార్ఖండ్‌లోని రాంచీ, లోహర్‌దాగాలో దాడులు నిర్వహించినట్లు ఆదాయపు పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. బల్దేవ్ సాహు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సత్పురా కార్యాలయంలోనూ దాడులు జరిగాయి.

తొమ్మిది అల్మరాల్లో నింపిన రూ.500, రూ.200, రూ.100 కరెన్సీ నోట్లను ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. 157 బస్తాల్లో నోట్లను లెక్కించి ఆ నగదును బస్తాల్లో నింపి బ్యాంకులకు తరలించారు. నివేదికల ప్రకారం.. కౌంటింగ్ ఇంకా పూర్తికానందున ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. దాడులు జరుగుతున్న ప్రదేశాల బ్యాంకులలో ఒకే చోట ఇంత మొత్తంలో డబ్బును ఉంచడానికి ఏర్పాట్లు లేవు. పెద్ద బ్యాంకులను సంప్రదించి ఈ డబ్బును దాయడానికి ఐటీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆదాయపు పన్ను శాఖకు చెందిన 36 బృందాలు.. ఒడిషా, జార్ఖండ్, బెంగాల్‌లలోని 36 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. కాంగ్రెస్ ఎంపీతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. వీటి మొత్తం విలువ రూ.510 కోట్లకు పైనే వుంటుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి డబ్బు లెక్కించే పనిలో వుండగా.. పెద్ద మొత్తంలో బంగారం కూడా వున్నట్లు తెలుస్తోంది. దీని విలువను కూడా మదించే పనిలో ఐటీ శాఖ వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios