నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28వ తేదీన ప్రారంభిస్తున్నారు. అదే రోజున సావర్కర్ జయంతి కూడా. నూతన పార్లమెంటు భవన ప్రారంభమై ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు సంధిస్తూ ట్వీట్లు చేశాయి.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూతన పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం ప్రధాని మోడీని కలిశారు. నూతన పార్లమెంటు ప్రారంభ కార్యక్రమానికి విచ్చేయాలని, ఆ భవనాన్ని ప్రారంభించాలని కోరినట్టు లోక్సభ సెక్రెటేరియట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే మే 28వ తేదీనే వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి కూడా కావడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులు వచ్చాయి.
నూతన పార్లమెంటు భవనంలోని లోక్సభ చాంబర్లో సౌకర్యవంతంగా 888 మంది సభ్యులు కూర్చోవచ్చు. అదే రాజ్యసభ చాంబర్లో 300 మంది కూర్చోవచ్చు. ఒక వేళ రెండు సభల సభ్యులు కూర్చోవాలనుకుంటే.. మొత్తం 1,280 మంది సభ్యులు లోక్సభ చాంబర్లో కూర్చునే వీలు ఉన్నది.
2020 డిసెంబర్ 10వ తేదీన నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ భవనం స్వల్ప సమయంలో ఎన్నో హంగులతో నిర్మితమైందని లోక్సభ సెక్రెటేరియట్ తెలిపింది.
Also Read: రోమ్ తగలబడిపోతుంటే.. ఫిడేల్ వాయించినట్టు: మణిపూర్ హింసను పేర్కొంటూ కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్
ఈ వార్తలు రాగానే సోషల్ మీడియాలో రాజకీయం రగిలింది. నూతన పార్లమెంటు భవనం ప్రధాని మోడీ తనకు తాను ప్రతిష్టను పెంచుకునే ఒక ప్రాజెక్టు అని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రతిపక్షాల మైక్రోఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఇలాంటి కొత్త భవనంతో వచ్చే ప్రయోజనం ఏమిటీ అని ప్రశ్నించింది. అలాగే.. పార్లమెంటు అంటే ఒక భవంతి కాదని, అది నిస్సహాయుల పక్షాన వినిపంచే ఒక గళం అని పేర్కొంది.
కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేస్తూ.. పార్లమెంటు బిల్డింగులంటే కేవలం ఇటుకలు, సిమెంట్ కాదని, అది గొంతులేని సమూహపు గళం అని పేర్కొన్నారు. ఇది ఏరియానో.. సౌకర్యాలో కాదు.. ఒక గొంతు అని వివరించారు. కానీ, ఇప్పుడు ఆ గళాలు వినపడకుండా మైక్రోఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారని విమర్శించారు.
