ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మిక తనిఖీ.. నూతన పార్లమెంటు నిర్మాణ పనుల పరిశీలన.. వీడియో ఇదే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. సేఫ్టీ హెల్మెట్ ధరించి సుమారు గంటపాటు పనులను తనిఖీ చేశారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కలియతిరిగారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి(PM) నరేంద్ర మోడీ(Narendra Modi) అమెరికా బిజీ షెడ్యూల్ ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాతి రోజే మరో పనిపై దృష్టి సారించారు. నిన్న రాత్రి అనూహ్యంగా ఢిల్లీలోని నూతన పార్లమెంటు(New Parliament) భవన నిర్మాణ పనులను తనిఖీ(Check) చేశారు. ఆదివారం సాయంత్రం 8.45 గంటల ప్రాంతంలో సెంట్రల్ విస్టా(Central Vista)లో భాగంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంటు భవన నిర్మాణ సైట్కు వెళ్లారు. సేఫ్టీ హెల్మెట్ ధరించి ఆ ప్రాంతాలో కలియతిరిగారు. కార్మికులు, అధికారులతో మాట్లాడారు. నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లోక్సభ, రాజ్యసభల నిర్మితమవుతున్న ప్రాంతాల్లో తిరిగారు. నూతన పార్లమెంటు భవన కన్స్ట్రక్షన్ మ్యాప్ చూసి పనులు పరిశీలించారు.
ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలు కనుక్కున్నారు. ఇకపై జరగనున్న నిర్మాణాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇలా మాట్లాడుతుండగా ఓ కార్మికుడు ప్రధానమంత్రి మోడీ ఆశిస్సులు తీసుకున్నారు. ఈ పర్యటన నిన్న రాత్రి 8.45 గంటల ప్రాంతంలో జరిగినట్టు ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. సుమారు గంటపాటు ఆయన తనిఖీలు చేసినట్టు వివరించాయి. భారత్ బంద్కు ఒక రోజు ముందే ఆయన ఈ ఆకస్మిక తనిఖీలు చేయడం గమనార్హం. సోమవారం దేశవ్యాప్తంగా భారత్ బంద్ పాటించాలని ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
నూతన పార్లమెంటు బిల్డింగ్ సైట్కు ప్రధానమంత్రి మోడీ వెళ్లడం ఇదే ప్రథమం. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ. 971 కోట్ల అంచనా వ్యయంతో ఈ భవనం నిర్మితమవుతున్నది. వచ్చే ఏడాదిలోగా ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంటును నిర్మించడాన్ని ఆపి దేశంలో వైద్యారోగ్య వసతులు నిర్మించాలని ప్రతిపక్షాలు కేంద్రంపై ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల వ్యాఖ్యలపై ప్రధానమంత్రి మోడీ ఇటీవలే మండిపడ్డారు. ఢిల్లీలోని డిఫెన్స్ మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తూ ఈ ప్రాజెక్ట్ను పూర్తిగా నిలిపేయడానికి ప్రతిపక్షాలు కుట్ర చేశాయని విరుచుకుపడ్డారు.