చరిత్ర సృష్టించిన ఇండియా.. 100 కోట్ల మార్క్ దాటిన వ్యాక్సిన్ డ్రైవ్.. ఈ విజయం ప్రతి పౌరునిది అన్న మోదీ
భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ 100 కోట్ల మోతాదుల మైలు రాయిని దాటింది. ఈ అద్భుతమైన ఘనత సాధన కోసం కృషి చేసిన డాక్టర్లు, నర్సులు, అందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM narendra Modi) కృతజ్ఞతలు చెప్పారు.
కరోనా వ్యాక్సినేషన్ పంపిణీలో భారత దేశం సరికొత్త చరిత్రను లిఖించింది. కరోనా వైరస్ను అరికట్టేందుకు భారత్లో చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ 100 కోట్ల మోతాదుల మైలు రాయిని దాటింది. ఈ అద్భుతమైన ఘనత సాధన కోసం కృషి చేసిన డాక్టర్లు, నర్సులు, అందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM narendra Modi) కృతజ్ఞతలు చెప్పారు. ఈ మైలురాయి భారతీయ సైన్స్, ఎంటర్ప్రైజ్, 130 కోట్ల మంది భారతీయుల సమిష్టి స్ఫూర్తికి విజయమని మోదీ అన్నారు. ఇక, ఈరోజు( అక్టోబర్ 21) ఉదయం 10 గంటలకు ముందే భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ 100 కోట్ల మోతాదులను దాటింది.
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ క్యాంపస్లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కొత్త భవనాన్ని ప్రారంభించిన మోదీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. ‘అక్టోబర్ 21, 2021 ఈ రోజు చరిత్రలో నమోదైంది. కొద్దిసేపటి క్రితమే భారతదేశం 100 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను దాటింది. గడిచిన 100 సంవత్సరాలలో అతిపెద్ద మహమ్మారిని ఎదుర్కోవటానికి.. భారత్ ఇప్పుడు 100 కోట్ల వ్యాక్సిన్ మోతాదుల యొక్క బలమైన రక్షణ కవచాన్ని కలిగి ఉంది. ఈ విజయం భారతదేశానిది, భారత్లోని ప్రతి పౌరునిది’అని పేర్కొన్నారు.
ఈరోజు ఉదయం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ని సందర్శించిన ప్రధాని మోడీ.. కరోనా వ్యాక్యానేషన్ 100 కోట్ల మోతాదుల మైలురాయిని సాధించిన తర్వాత ఆసుపత్రి అధికారులతో మాట్లాడారు. ఇక, కరోనా వ్యాక్సినేషన్కు సంబంధించి ప్రధాని మోదీ పలు సందర్బాల్లో ఆరోగ్య కార్యకర్తల సేవలను ప్రశంసించిన సంగతి తెలిసిందే.
‘భారతదేశానికి అభినందనలు! ఇది మా దూరదృష్టి గల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ ఫలితం’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ట్వీట్ చేశారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ 100 కోట్ల మైలురాయిని చేరుకన్నట్టుగా ఈ రోజు ఉదయం 9.48 గంటలకు ఆయన ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.
Also read: ట్రూత్ సోషల్.. సొంత సోషల్ నెట్వర్క్పై క్లారిటీ ఇచ్చిన ట్రంప్.. అన్నంత పని చేసేశాడు..
ప్రభుత్వం గణంకాల ప్రకారం 1.3 బిలియన్ ప్రజలు ఉన్న భారత్లో దాదాపు మూడొంతుల మంది వయోజనులు ఒక షాట్ వ్యాక్సిన్ పొందారు.. దాదాపు 30 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.