మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సర్కారుపై మోడీ విమర్శలు.. : చాయ్ వాలా పాలనలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
Rajkot: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థులకు మద్దతుగా రాజ్కోట్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. తన పనితీరును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్ల పదవీకాలంతో పోల్చుతూ విమర్శలు గుప్పించారు.
Gujarat Assembly Elections: ఒక ఆర్థికవేత్త ప్రధానిగా ఉన్న పదేండ్ల కాలంలో భారత్ ఒక్కస్థానం మాత్రమే పైకి ఎగబాకింది.. కానీ చాయ్ వాలా పాలనలో ప్రపంచంలో ఐదో అతిపెద్ద అర్థిక వ్యవస్థగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థులకు మద్దతుగా రాజ్కోట్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. తన పనితీరును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్ల పదవీకాలంతో పోల్చుతూ విమర్శలు గుప్పించారు.
గుజరాత్ లో బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోడీ.. 2014 వరకు పదేళ్ల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఒక ప్రఖ్యాత ఆర్థికవేత్త ప్రధానిగా ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం ఒక స్థానం మాత్రమే ఎగబాకి పదో స్థానానికి చేరుకుందని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై పరోక్షంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. 2014లో తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఎనిమిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో అతిపెద్ద దేశంగా మారిందని అన్నారు. రాష్ట్రంలోని 182 అసెంబ్లీ స్థానాలకు గానూ 89 స్థానాలకు తొలి దశలో డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. తొలి దశ ఓటింగ్కు ముందు ప్రధాని మోదీకి ఇదే చివరి ఎన్నికల ప్రచార ర్యాలీ.
"2014లో నేను ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందు పదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2004 లో కాంగ్రెస్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు, ఒక ప్రఖ్యాత ఆర్థికవేత్త (మన్మోహన్ సింగ్) మన ప్రధానిగా ఉన్నారు. అయితే, ఈ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11 వ స్థానానికి చేరుకుంది" అని మోడీ అన్నారు. కానీ, "తర్వాత సంవత్సరాల్లో, వారు ఏమి చేసినప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ పదవ అతిపెద్దదిగా మారింది. కాబట్టి, భారతదేశం 11వ సంఖ్య నుండి 10వ స్థానానికి చేరుకోవడానికి పదేళ్లు పట్టింది" అని ప్రధాని అన్నారు. తాను ఆర్థికవేత్తనని ఎప్పుడూ చెప్పుకోలేదని, అయితే దేశ పౌరుల బలంపై తనకు నమ్మకం ఉందని మోడీ అన్నారు. "మీరు 2014లో 'చాయ్వాలా' (టీ విక్రేత)కి పగ్గాలు ఇచ్చారు. నేను ఆర్థికవేత్తనని ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ, పౌరుల బలంపై నాకు నమ్మకం ఉంది. గత ఎనిమిదేళ్లలో, భారతదేశం పదో స్థానం నుంచి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది" అని అన్నారు.
గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీ పాలనలో జరుగుతున్న విషయాలు, అభివృద్దిని పోల్చుకోవాలని ప్రధాని మోడీ అన్నారు. "కాబట్టి సరిపోల్చండి. 11వ ర్యాంక్ (కాంగ్రెస్ హయాంలో) నుంచి 10వ స్థానానికి చేరుకోవడానికి పదేళ్లు పట్టగా.. 10వ స్థానం (బీజేపీ ప్రభుత్వ హయాంలో) నుంచి ఐదో స్థానానికి చేరుకోవడానికి ఎనిమిదేళ్లు మాత్రమే పట్టింది" అని ఆయన అన్నారు. స్వాతంత్య్రం తర్వాత భారతదేశం ఎగుమతుల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందనీ, పెట్టుబడిదారులకు దేశం ఇష్టమైన గమ్యస్థానంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు.