PM Narendra Modi speech in Adampur: పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. ఆపరేషన్ సింధూర్లో మన సైనికుల పాత్రను ప్రశంసించారు. ఈ దాడిలో 100+ మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాల లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇక్కడ మన సైనిక బలాన్ని ప్రదర్శించామని ప్రశంసలు కురిపించారు.
PM Modi Praises Air Warriors at Adampur Airbase: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. వైమానిక దళ సిబ్బంది, సైనికులతో మాట్లాడారు. భారత సైన్యంపై ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆదంపూర్తో సహా కీలకమైన భారత వైమానిక స్థావరాలపై పదే పదే దాడి చేయడానికి ప్రయత్నించింది, కానీ ప్రతిసారీ విఫలమైందని జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు. "శత్రువు మళ్లీ మళ్లీ మనల్ని లక్ష్యంగా చేసుకుంది. కానీ వారి దుష్ట పన్నాగాలు ఓడిపోయాయి" అని భారత సైన్యంపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు.
ఆదంపూర్ వైమానిక స్థావరంలో ప్రధాని మోడీ మట్లాడుతూ.. "మీరందరూ మీ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకున్నారని నేను గర్వంగా చెప్పగలను" అని ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ను ప్రస్తావించారు. ఈ మిషన్ లో విజయవంతం చేయడంలో భారత సాయుధ దళాలు అద్భుతమైన పోరాటం చేశాయని కొనియాడారు. పాకిస్తాన్ లోపల ఉగ్రవాద శిబిరాలు, వైమానిక స్థావరాలను నాశనం చేయడమే కాకుండా శత్రువు దుష్ట పన్నాగాలు, ధైర్యాన్ని కూడా పగులగొట్టి, సరిహద్దు దాటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని భారత్ పంపించిందని అన్నారు.
మంగళవారం పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక దళ స్టేషన్లో "భారత్ మాతా కీ జై, వందేమాతరం" నినాదాలు మార్మోగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత వైమానిక దళ సిబ్బంది, సైనికులను కలిశారు. విజయవంతమైన ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్ది రోజులకే వాతావరణం గర్వంగా, ఉత్సాహంగా ఉందని తెలిపారు.
ఆదంపూర్ కు చేరుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించిన వైమానిక యోధులు, గ్రౌండ్ సిబ్బందితో సంభాషించారు. చిరునవ్వులు, జయజయధ్వానాలు, వందనాలు ఆయనకు స్వాగతం పలికాయి. "ప్రతిరోజూ ధైర్యం, దృఢ సంకల్పం, నిర్భయత్వాన్ని ప్రదర్శించే వారిని కలవడం చాలా ప్రత్యేకమైన అనుభవం" అని ప్రధానమంత్రి తర్వాత Xలో పోస్ట్ చేశారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా మే 7న ప్రారంభమైన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆదంపూర్ అత్యంత చురుకైన వైమానిక స్థావరాలలో ఒకటి. ఈ దాడిలో 26 మంది భారతీయ పర్యాటకులు మరణించారు. ఈ మిషన్ పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని అనేక ఉగ్రవాద శిబిరాలు, 11 వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక, భూమి, సముద్ర మార్గాల ద్వారా ఖచ్చితమైన, సమన్వయంతో కూడిన ఆపరేషన్ లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పౌరులకు హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
భారతదేశ ఆపరేషన్ ఉగ్రవాద శిబిరాలపై దృష్టి సారించిందనీ, పాకిస్తాన్ పౌరులు లేదా పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదని వైమానిక దళ చీఫ్ మార్షల్ ఏకే భారతి సోమవారం స్పష్టం చేశారు. "మా పోరాటం ఉగ్రవాదులతో, పాకిస్తాన్ ప్రజలతో కాదు. మా లక్ష్యం స్పష్టంగా ఉంది" అని ఆయన అన్నారు.