Nikhat Zareen: ప్రపంచ ఛాంపియన్గా తెలంగాణ బిడ్డ.. ప్రధాని మోడీ ప్రశంసలు
Nikhat Zareen: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 52 కేజీల విభాగంలో తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం గెలిచింది. ఫైనల్లో థాయిలాండ్ బాక్సర్పై నిఖత్ జరీన్ అద్భుత విజయం సాధించి..మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.
World Boxing Championship: తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ప్రపంచ వేదికపై బంగారు పతకం గెలిచి.. మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ఫైనల్లో థాయిలాండ్ బాక్సర్పై నిఖత్ జరీన్ అద్భుత విజయం సాధించింది. వివరాల్లోకెళ్తే.. టర్కీలోని ఇస్తాంబుల్లో జరుగుతున్న ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 12వ ఎడిషన్లో నిఖత్ జరీన్ స్వర్ణం పథకం సాధించింది. గోల్డ్ మెడల్ గెలిచిన నిఖత్ జరీన్ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. అలాగే, ఇదే వేదికపై మనీషా మౌన్, పర్వీన్ హుడాలు కాంస్య పతకాలను సాధించించారు. వీరిని కూడా ప్రధాని మోగీ ప్రశంసించారు. ప్రపంచ ఛాంపియన్షిప్ లో భారత ఖ్యాతిని మరింతగా పెంచారని పేర్కొన్నారు.
“మా బాక్సర్లు మాకు గర్వకారణం! మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో అద్భుతమైన బంగారు పతకాన్ని గెలుచుకున్న @nikhat_zareenకి అభినందనలు. ఇదే పోటీలో కాంస్య పతకాలు సాధించిన మనీషా మౌన్ మరియు పర్వీన్ హుడాలను కూడా నేను అభినందిస్తున్నాను' అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
ఇస్తాంబుల్ లో జరిగిన ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 12వ ఎడిషన్లో భారత బాక్సర్ నిఖత్ జరీన్ ఫైనల్లో 5-0తో ఆధిపత్యంతో అద్భుత విజయం నమోదు చేసింది. అంచనాలకు తగ్గట్టుగానే, నిఖత్ 52 కేజీల ఫైనల్లో థాయ్లాండ్కు చెందిన జిట్పాంగ్ జుటామాస్ చిత్తుగా ఓడించింది. బౌట్లో 30-27, 29-28, 29-28, 30-27, 29-28తో స్కోర్ సాధించింది.
నిజామాబాద్ (తెలంగాణ)లో జన్మించిన బాక్సర్ నిఖత్ జరీన్.. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఛాంపియన్ అయిన మేరీకోమ్ (2002, 2005, 2006, 2008, 2010, 2018), సరితా దేవి (2006), జెన్నీ RL (2006), లేఖ KC (2006) తర్వాత ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన ఐదవ భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. 2018లో బాక్సింగ్ గ్రేట్ మేరీకోమ్ గెలిచిన తర్వాత భారత్కు మళ్లీ అందిన బంగారు పతకం ఇదే.
మనీషా (57 కేజీలు) మరియు పర్వీన్ (63 కేజీలు)లు కాంస్య పతకాలు గెలుచుకున్నారు.