అహ్మదాబాద్లో నేడు జరగాల్సిన ప్రధాని రోడ్ షో రద్దు.. కారణమదేనా..?
గుజరాత్, రాజస్థాన్లలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ మోర్బి కేబుల్ బ్రిడ్జ్ విషాదం నెలకొన్న నేపథ్యంలో సోమవారం అహ్మదాబాద్లో జరగాల్సిన రోడ్షోను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే..ప్రధాని మోడీ వర్చువల్ సమక్షంలో జరగాల్సిన పేజ్ కమిటీ స్నేహ మిలన్ కార్యక్రమం వాయిదా పడింది.
ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్, రాజస్థాన్లలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం గుజరాత్లోని మోర్బీలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ వంతెన కూలింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారు. మోర్బీ వంతెన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని సోమవారం అహ్మదాబాద్లో జరగాల్సిన రోడ్ షోను రద్దు చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. అలాగే.. ప్రధాని మోదీ వర్చువల్ సమక్షంలో జరగాల్సిన పేజీ కమిటీ స్నేహ మిలన్ కార్యక్రమం కూడా వాయిదా పడినట్లు గుజరాత్ బీజేపీ మీడియా కన్వీనర్ డాక్టర్ యగ్నేష్ దవే తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోర్బీ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని సోమవారం ఎలాంటి రోడ్డు షోలు ఉండవని తెలిపారు. అయితే..2900 కోట్ల రైల్వే ప్రాజెక్టులను అంకితం చేసే కార్యక్రమం మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని తెలిపారు. అదే సమయంలో.. మోర్బీ ప్రమాదంలో మహిళలు, పిల్లలు మరియు వృద్ధులతో సహా 91 మంది మరణించినట్లు సమాచారం.
ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని రాజ్కోట్ బీజేపీ ఎంపీ మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందారియా తెలిపారు. 60 మందికి పైగా మృతదేహాలను వెలికి తీశామని, ఇందులో ఎక్కువగా పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారని తెలిపారు. మిగిలిన వాటిని కాపాడేందుకు కసరత్తు జరుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందనీ, ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నామని తెలిపారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. బ్రిడ్జిపై సామర్థ్యానికి మించి ప్రజలు ఉన్నందున ఈ ఘటన జరిగిందని ఆయన అన్నారు.
బ్రిడ్జిపై భారీ సంఖ్యలో గుమికూడటంతో ఈ ఘటన జరిగి ఉంటుందని అక్కడికక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డిఆర్ఎఫ్) సంఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. అంతకుముందు, ప్రధాని మోదీ పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని, బాధిత వ్యక్తులకు సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించాలని కోరినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంతాపం
క్షతగాత్రులకు తక్షణమే చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. మోర్బీలో సస్పెన్షన్ బ్రిడ్జి కూలిపోవడం పట్ల తాను చాలా బాధపడ్డాననీ, గాయపడిన వారికి తక్షణ చికిత్స కోసం ఏర్పాట్లు చేయాలని వ్యవస్థను ఆదేశించినట్టు తెలిపారు.