కాంగ్రెస్ హయాంలో ప్రధాని పైనా సూపర్ పవర్ ఉండేది: ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు రాజస్తాన్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీద ధర్నాలు చేశారని, ఎప్పుడూ ఉగ్రవాద దాడులు జరుగుతుండేవని, యువత అంధకారంలో మునిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉండి ఉంటే టీకా పంపిణీ పూర్తి చేయడానికి మరో 40 సంవత్సరాలు పట్టేదని అన్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు రాజస్తాన్లో నిర్వహించిన ఓ పబ్లిక్ ర్యాలీలో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధానమంత్రి పైనా ఒక సూపర్ పవర్ ఉండేదని అన్నారు. అందుకే ఏ నిర్ణయమైనా సకాలంలో తీసుకునేది కాదని చెప్పారు.
‘2014 కంటే ముందు మన దేశంలో పరిస్థితులు ఎలా ఉండేవో మీకు గుర్తున్నాయా? అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లో ఉండేవారు. పెద్ద పెద్ద నగరాలపై ఎప్పుడూ ఏదో ఉగ్రవాదుల దాడి జరిగేది. ప్రధాని పైనా ఒక సూపర్ పవర్ ఉండేది. అప్పటి ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ ద్వారా నడిచేది. సరిహద్దుల్లో రోడ్లు వేయడానికి కూడా ఆ ప్రభుత్వం భయపడింది’ అని అజ్మేర్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
రాజస్తాన్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు యువత అంధకారంలో ఉన్నదని ప్రధాని తెలిపారు. మహిళలపై నేరాలు అధికంగా జరిగేవని ఆరోపించారు. ఇప్పుడు మన దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సాధ్యమైందని అన్నారు.
Also Read: సావిత్రిబాయి ఫూలేపై అభ్యంతరకర రాతలు.. ఆ వెబ్సైట్లు రద్దు చేయాలి: మహారాష్ట్రలో ఎన్సీపీ నేతల నిరసన
కాంగ్రెస్ తరుచూ హామీలు ఇచ్చేదని, వాటిని తీర్చడంపై దృష్టి పెట్టకపోతుండేదని విమర్శించారు. హామీలతోనే దేశాన్ని సంక్షోభంలోకి తీసుకెళ్లిందని వివరించారు. కాంగ్రెస్ గరీబీ హఠావో అనే నినాదాన్ని తెచ్చిందని గుర్తు చేశారు. 50 ఏళ్ల క్రితం ఈ హామీ ఇచ్చిందని, కానీ, 2013 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయలేదని వివరించారు. ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజలనే వేటాడి వెంటాడేదని పేర్కొన్నారు. ఈ నమ్మకద్రోహాలతో రాజస్తాన్ ప్రజలూ నష్టపోయారని చెప్పారు.
బీజేపీ అధికారంలో ఉన్నది కాబట్టే 100 శాతం వ్యాక్సినేషన్ సాధ్యమైందని ప్రధాని మోడీ అన్నారు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే 100 శాతం వ్యాక్సినేషన్కు మరో నలభై సంవత్సరాలు పట్టేదని ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు కేవలం 60 శాతం టీకా పంపిణీ మాత్రమే పూర్తయ్యేదని ఊహించారు. అంటే.. మహిళలు, గర్భిణులు, పిల్లలు ఎంతో మంది ఈ జీవన్మరణ యుద్ధంలో ఓడిపోయేవారని తెలిపారు.