సావిత్రిబాయి ఫూలేపై అభ్యంతరకర రాతలు.. ఆ వెబ్సైట్లు రద్దు చేయాలి: మహారాష్ట్రలో ఎన్సీపీ నేతల నిరసన
సావిత్రిబాయి ఫూలేపై అభ్యంతరకర రాతలు రాసిన వారిపై,పోస్టు చేసిన వెబ్ సైట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముంబయి పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట ఎన్సీపీ నేతలు బుధవారం నిరసన చేశారు. అనంతరం, చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఏక్నాథ్ షిండే ఆదేశించారు.
న్యూఢిల్లీ: మన దేశంలో మహిళలు విద్యకు నోచుకోవడానికి పాటుపడిన సామాజిక సంస్కర్త సావిత్రిబాయి ఫూలేపై కొన్ని వెబ్సైట్లు అభ్యంతరకర రాతలు రాశాయి. ఈ రాతలను మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ముంబయి పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదురుగా బుధవారం వారు నిరసన చేశారు. ఆ వెబ్సైట్లపై, ఆ రాతలు రాసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన తర్వాత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆరోపణలను పరిశీలించి అనుగుణమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమాజక శ్రేయస్సుకు పాటుపడిన యోధుల, ధీర వనితల గురించి రాసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వారికి వ్యతిరేకంగా అభ్యంతరకర రాతలు రాసే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరాదని పేర్కొన్నారు.
సీనియర్ ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, జయంత్ పాటిల్, సునీల్ తత్కారే, ఛగన్ భుజ్బల్ సహా పార్టీ కార్యకర్తలు ముంబయి పోలీసు కమిషనర్ ఆఫీసు ఎదటు ధర్నా చేశారు. అజిత్ పవార్, జయంత్ పాటిల్, భుజ్బల్ల సంతకం పెట్టఇన లేఖను సిటీ పోలీసు చీఫ్కు అందించారు. ఇండిక్ టేల్స్, హిందు పోస్ట్ అనే వెబ్సైట్లు ఫూలేకు వ్యతిరేకంగా అభ్యంతరకర ఆర్టికల్స్ పోస్టు చేశారని తెలిపారు. ఈ ఆర్టికల్ ప్రజలను రెచ్చగొట్టాలనే దురుద్దేశ్యంతో కావాలనే రాశారని పేర్కొన్నారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్, షాహు-ఫూలే-అంబేద్కర్ల మహారాష్ట్రలో సావిత్రిబాయి ఫూలేను అవమానించడం దారుణం, దీన్ని తీవ్రంగా అందరూ నిరసించాలని ఆ లేఖలో తెలిపారు.
Also Read: ఆన్లైన్ గేమ్లకు అడిక్ట్.. ఇంట్లోని నగదు, నగలు పట్టుకుని యూపీ నుంచి బెంగళూరుకు 13 ఏళ్ల బాలుడు
అనంతరం, సీఎంవో ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. సావిత్రిబాయి ఫూలేకు వ్యతిరేకంగా అభ్యంతరకర ఆర్టికల్ను నిరసిస్తూ చాలా మంది సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు, సంఘాలు ఆందోళన చేశాయని ఆ ప్రకటన గుర్తు చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఇండిక్ టేల్స్ వెబ్సైట్లోని ఆర్టికల్ను పరిశీలించి యాక్షన్ తీసుకోవాలని సీఎం ఏక్నాథ్ షిండే అధికారులను ఆదేశించినట్టు ఆ ప్రకటన పేర్కొంది.
ఆ పోర్టల్ చరిత్రను తిరిగి రాస్తామని చెబుతూ.. చరిత్రను నాశనం చేస్తున్నదని ఎన్సీపీ నేత భుజ్బల్ సోమవారం సీఎం షిండేకు ఓ లేఖ రాశారు. ఈ సమాజ వ్యతిరేక తీరును తప్పకుండా అడ్డుకుని తీరాలని సూచించారు.