దేశ విచ్చిన్నకారులకు గుజరాత్ ప్రజలు మద్దతు ఇవ్వరు.. : కాంగ్రెస్ పై ప్రధాని మోడీ విమర్శలు
Gandhinagar: భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే అంశాలకు మద్దతు ఇచ్చే వారికి సహాయం చేయడానికి గుజరాత్ ప్రజలు సిద్ధంగా లేరని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ ప్రధాని కాంగ్రెస్ ను విమర్శిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
Gujarat Assembly Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అన్ని ప్రధాన పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మరోసారి గుజరాత్ అధికార పీఠం దక్కించుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఆ పార్టీకి చెందిన అగ్రనాయకులు ఎన్నికల ప్రచారం చేస్తూ.. ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గుజరాత్ లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే అంశాలకు మద్దతు ఇచ్చే వారికి సహాయం చేయడానికి గుజరాత్ ప్రజలు సిద్ధంగా లేరని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ముందుకు సాగుతున్న దేశవ్యాప్త భారత్ జోడో యాత్రలో నర్మదా బచావో ఆందోళన్ కార్యకర్త మేధా పాట్కర్ పాల్గొనడంపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మళ్లీ కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకున్నారు. గుజరాత్ ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ప్రతిపక్ష పార్టీ విభజించి పాలించు వ్యూహాన్ని విస్మరించాలని సూచించారు.
గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థులకు మద్దతుగా భావ్నగర్ జిల్లాలోని పలితానా పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఒక ప్రాంత ప్రజలను మరొకరికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే పార్టీ విధానం వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందనీ, అందుకే గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించారని అన్నారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే అంశాలకు మద్దతు ఇచ్చే వారికి సహాయం చేయడానికి గుజరాత్ ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో మేధా పాట్కర్తో కలిసి నడిచినందుకు రాహుల్ గాంధీని కూడా మోడీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. సౌరాష్ట్రలోని ఎండిపోయిన ప్రాంతానికి నర్మదా జలాలు చేరకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 40 ఏళ్లుగా సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్టును ఆపడానికి కారణమైన వ్యక్తితో కలిసి నడిచిన వారిని గుజరాత్ ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు.
‘విభజించి పాలించడమే కాంగ్రెస్ సిద్ధాంతం. గుజరాత్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించే ముందు అది (కాంగ్రెస్) గుజరాతీలు, మరాఠీలను పరస్పరం పోరాడేలా చేసింది. తర్వాత వివిధ కులాల వారిని కాంగ్రెస్ రెచ్చగొట్టింది. ప్రజాసంఘాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. కాంగ్రెస్ చేసిన పాపాల వల్ల గుజరాత్ చాలా నష్టపోయింది అని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్లోని తెలివైన ప్రజలు కాంగ్రెస్ వ్యూహాన్ని అర్థం చేసుకున్నారు. అటువంటి విచ్ఛేద శక్తులకు ఇక్కడి ప్రజలు మద్దతు ఇవ్వరని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిందని, గత 20 ఏళ్లుగా గుజరాత్ అభివృద్ధి పథంలో నడుస్తోందని అన్నారు. "గుజరాత్ ప్రజలు ఐక్యతను ప్రదర్శించినందున కాంగ్రెస్ ఓడిపోతోంది. గుజరాత్ ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు కాంగ్రెస్ కులతత్వం, మతతత్వం, ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉండాలి. విభజించి పాలించాలి సిద్ధాంతాలు మానుకోవాలి. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే అంశాలకు మద్దతిచ్చే వారికి సహాయం చేయకండి" అని ప్రధాన మంత్రి అన్నారు.
కాగా, 182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.