పఠాన్కోట్ దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ హతం.. కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తలు..
పఠాన్కోట్ దాడికి సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు షాహిద్ లతీఫ్ను బుధవారం పాకిస్థాన్లోని సియాల్కోట్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

పఠాన్కోట్ దాడికి సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు షాహిద్ లతీఫ్ను బుధవారం పాకిస్థాన్లోని సియాల్కోట్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. స్థానిక మీడియా ప్రకారం.. అక్కడి పరిస్థితుల గురించి తెలిసినవారే లతీఫ్ను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారు. స్థానిక ఉగ్రవాదులే షాహిద్ లతీఫ్ను హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
41 ఏళ్ల షాహిద్ లతీఫ్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (జేఎం) సభ్యుడు. 2016 జనవరిలో పఠాన్కోట్లోని భారత వైమానిక దళ స్థావరంపై దాడికి ప్రధాన కుట్రదారుగా ఉన్నాడు. అతడు పాకిస్తాన్లో సియాల్కోట్ నుంచి పఠాన్కోట్పై దాడిని సమన్వయం చేశాడు. తన ప్లాన్ను అమలు చేయడానికి నలుగురు జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులను పఠాన్కోట్కు పంపాడు.
పఠాన్కోట్ దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీసింది. ఇక, లతీఫ్కు చాలా ఏళ్లుగా ఉగ్రవాదంతో అనుబంధం ఉంది. చట్టవిరుద్ధమైన (కార్యకలాపాల) నిరోధక చట్టం (ఉపా) కింద ఉగ్రవాద ఆరోపణలపై లతీఫ్ భారతదేశంలో అరెస్టు చేయబడ్డాడు. విచారణ అనంతరం జైలుకు కూడా పంపబడ్డాడు. భారతదేశంలో శిక్ష అనుభవించిన తరువాత.. 2010లో వాఘా మీదుగా పాకిస్తాన్కు బహిష్కరించబడ్డాడు. ఇక, 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన కేసులో కూడా లతీఫ్పై ఆరోపణలు ఉన్నాయి.
2010లో విడుదలైన తర్వాత లతీఫ్ పాకిస్థాన్లోని జిహాదీ ఫ్యాక్టరీకి తిరిగి వెళ్లాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తులో తేలింది. అతడిని భారత ప్రభుత్వం వాంటెడ్ టెర్రరిస్టుగా పేర్కొంది.