రైలు ప్రమాదస్థలి నుంచి ప్రయాణికులను తీసుకెళ్లుతున్న బస్సుకు యాక్సిడెంట్
ఒడిశాలోని బాలాసోర్లో మూడు ట్రైన్లు ఢీకొట్టిన ఘటనలో ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు ఇతర వాహనాల్లో తమ ప్రయాణాన్ని పున:ప్రారంభించారు. ఇలా ఓ బస్సులో పశ్చిమ బెంగాల్ వెళ్లిన కొందరు ప్రయాణికులు మరో ప్రమాదానికి గురయ్యారు. ఆ బస్సు ఎదురుగా పికప్ వ్యాన్ను ఢీకొట్టడంతో ప్రయాణికులు గాయపడ్డారు.
కోల్కతా: ఈ రోజు ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంతో దేశమంతా ఉలిక్కిపడింది. మూడు రైళ్లు ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో మరణాలు 300కు చేరువ అవుతున్నాయి. సుమారు వేయి మంది గాయపడ్డారు. ప్రధాని మోడీ సహా దేశ నేతలు, ప్రపంచ దేశాల నేతలూ బాధితుల పక్షాన నిలబడ్డారు.
ఈ మూడు రైళ్ల ప్రమాదం నుంచి బయటపడ్డారు బ్రతుకు జీవుడా అంటూ తమ గమ్యాలకు వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిన వారూ పశ్చిమ బెంగాల్లో మరో ప్రమాదానికి గురయ్యారు.
రైలు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలు దక్కించుకున్న కొందరు ప్రయాణికులు తమ ప్రయాణాలను ఇతర వాహనాల్లో వెళ్లిపోయారు. ఇలా పశ్చిమ బెంగాల్ వరకు బస్సులో వెళ్లిన కొందరు ప్రయాణికులు.. ఆ రాష్ట్రంలోని మేదినీపూర్లో మరో ప్రమాదానికి గురయ్యారు. ఆ బస్సు మేదినీపూర్లో ఓ పికప్ వ్యాన్ను ఢీకొట్టింది.
ఈ రోడ్డు ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులను స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల హాస్పిటల్స్కు చికిత్స కోసం పంపించారు. పోలీసులు సహాయక చర్యల్ల పాల్గొని క్షతగాత్రులను పలు మెడికల్ ఫెసిలిటీలకు తరలించారు.
Also Read: ఒడిశా రైలు ప్రమాదం: 300కు చేరువైన మరణాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
బాలాసోర్లోని బహనగ బాజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయనే విషయంపై స్పష్టత లేదు.
కొందరు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, కోల్కతా, చెన్నైల మధ్య నడిచే కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఈ స్టేషన్ సమీపంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఓ గూడ్స్ ట్రైన్ను వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ ట్రైన్ కోచ్లు ఎగిరి మరో ట్రాక్ పై పడ్డాయి. ఈ ఘటన జరిగిన తర్వాత ఈ ట్రైన్కు వ్యతిరేక దిశలో మరో ట్రైన్ వచ్చింది. దీంతో ఆ ట్రాక్ పడిన బోగీలను ఢీకొట్టింది. దీంతో పలు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రాణ నష్టం పెరిగింది.