ఒడిశా రైలు ప్రమాదం: 300కు చేరువైన మరణాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
Coromandel Express Accident: కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లు ఢీకొన్న ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రస్తుతం అందుతున్న నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 900 మందికి పైగా గాయపడ్డారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పశ్చిమ బెంగాల్ లోని షాలిమార్ స్టేషన్-చెన్నై మధ్య నడుస్తుంది. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గూడ్స్ రైలు కూడా ప్రమాదానికి గురైందని ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా తెలిపారు.
Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్య 288కి చేరింది. సహాయక చర్యల్లో రాష్ట్ర, కేంద్ర బలగాలు, ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో జరిగిన ఘోర రైలు పట్టాలు తప్పిన ఘటనలో 280 మంది మృతి చెందగా, 900 మందికి పైగా గాయపడ్డారని ప్రస్తుతం అందుతున్న నివేదికలు పేర్కొంటున్నాయి. రైలు ప్రమాదం నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం ఒక రోజు సంతాప దినాలను ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా ప్రముఖులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ఒడిశాలోని బాలాసోర్ లో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 288 మందికి పైగా మరణించారనీ, 900 మంది గాయపడ్డారని అగ్నిమాపక శాఖ డీజీపీ సుధాంశు సారంగి తెలిపినట్టు ఇండియా టుడే నివేదించింది. బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ అనే రెండు ప్యాసింజర్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ బోల్తా పడిన బోగీల్లో ఇంకా చాలా మంది ప్రయాణికులు చిక్కుకున్నారనీ, మృతదేహాలను బయటకు తీసేందుకు ఆర్మీతో పాటు కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బాలాసోర్, మయూర్భంజ్, భద్రక్, జాజ్పూర్, కటక్ జిల్లాల్లోని పలు ఆస్పత్రుల్లో 900 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు. గుర్తించిన మృతదేహాలను వారి బంధువులకు అప్పగించడం లేదా శవపరీక్ష అనంతరం వారి గమ్యస్థానాలకు తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గుర్తుతెలియని వారికి చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరిస్తామని తెలిపారు.
కోల్ కతాకు దక్షిణంగా 250 కిలోమీటర్లు, భువనేశ్వర్ కు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ రైలు ప్రమాదం జరిగింది. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే, ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కమిటీ ఏర్పాటును ప్రభుత్వం ప్రకటించింది.