తీరు మార్చుకోని ఇండిగో ఎయిర్లైన్స్ : ఫ్లైట్ క్యాన్సిల్.. వసతి ఏర్పాట్లకు ససేమిరా, ప్రయాణీకుల ధర్నా
ఇండిగో ఎయిర్లైన్స్ తీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేహ్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం రద్దు కావడంతో ప్రయాణీకులకు రేపటి వరకు వసతి కల్పించేందుకు ఇండిగో నిరాకరించింది. దీంతో ఎయిర్పోర్ట్లో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.
ఎన్నిసార్లు విమర్శలు వచ్చినప్పటికీ ఇండిగో ఎయిర్లైన్స్ (IndiGo airlines) సంస్థ , దాని సిబ్బంది బుద్ది మార్చుకోవడం లేదు. కొద్దిరోజుల క్రితం హీరోయిన్ పూజా హెగ్డే పట్ల ఇండిగో సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
బుధవారం ఉదయం లేహ్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానాన్ని (leh delhi flight) ఇండిగో రద్దు (flight cancellation) చేసింది. వాతావరణం అనుకూలంగా వున్నప్పటికీ.. సాంకేతిక సమస్యలతో విమానాన్ని రద్దు చేసింది ఇండిగో యాజమాన్యం. అయితే రేపటి వరకు ప్రయాణీకులకు వసతి , ఆహార ఏర్పాట్లు చేసేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ నిరాకరించినట్లుగా ఎన్టీవీ తన కథనంలో పేర్కొంది. దీంతో మధ్యాహ్నం రెండు గంటల నుంచి లేహ్ విమానాశ్రయంలోనే ప్రయాణీకులు ధర్నా చేస్తున్నారు. ఈ విమానంలో 30 మంది హైదరాబాద్ వాసులు వున్నట్లుగా తెలుస్తోంది. కనెక్టింగ్ ఫ్లైట్స్ విషయంలోనూ ఇండిగో ఎయిర్లైన్స్ బాధ్యత తీసుకోలేదని సమాచారం.
ALso Read:IndiGo: ఇండిగో ఎయిర్లైన్స్ కు రూ.5 లక్షల ఫైన్...
కాగా.. ఇటీవల ముంబయి నుంచి బయల్దేరిన ఇండిగో ఫ్లైట్ లో తనతో ఓ ఉద్యోగి చాలా రూడ్ గా ప్రవర్తించాడని హీరోయిన్ పూజా హెగ్డే మండిపడింది. అతని ప్రవర్తన చాలా దారుణంగా ఉందని తెలుపుతూ తాజాగా ట్వీటర్ వేదికన ఫైర్ అయ్యింది. సదరు ట్వీట్ లో.. ‘ఇండిగో 6ఈ ఉద్యోగి ఎంత రూడ్ గా ఉన్నాడో.. చాలా బాధగా ఉంది. ముంబయి నుండి బయలుదేరిన మా విమానంలో విపుల్ నకాషే అనే సిబ్బంది ఈరోజు మాతో ప్రవర్తించిన తీరు చాలా బాధగా ఉంది. ఎటువంటి కారణం లేకుండా మాతో పూర్తిగా అహంకారం, అజ్ఞానం మరియు బెదిరింపు టోన్ ఉపయోగించారు. సాధారణంగా నేను ఈ సమస్యల గురించి ట్వీట్ చేయను, కానీ ఇది నిజంగా భయంకరంగా ఉంది.’ అంటూ ఇండిగో ఎయిర్ లైన్ సంస్థ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.
అయితే.. ఇలాంటి ఘటనలు హీరోయిన్లకు గతంలో జరిగినవి చాలానే ఉన్నాయి. ఎప్పుటికప్పుడూ వాటిని సరిచేస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఎవరిపై కంప్లైట్ ఎరుగని బుట్టబొమ్మ తాజాగా ఇండిగో ఎయిర్ లైన్ స్టాఫ్ మెంబర్ పై బహిరంగంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. పూజా హెగ్దే కంప్లైంట్ కు సంస్థ ప్రతినిధులు ఎలా స్పందించారో, ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే పూజా ప్రస్తుతం పూరీజగన్నాథ్, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన ‘జేజీఎం’ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలె చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.