మైనర్ డ్రైవింగ్ చేశాడని తల్లిదండ్రులకు జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా
పుదుచ్చేరిలో ఓ మైనర్ బాలుడు డ్రైవింగ్ చేస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. మైనర్ బాలుడిని డ్రైవింగ్ చేయనిచ్చిన కారణంగా తల్లిదండ్రులకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు, రూ. 25 వేల జరిమానా కూడా పుదుచ్చేరి ప్రభుత్వం వేసింది.
న్యూఢిల్లీ: మైనార్టీ తీరకుండా డ్రైవింగ్ చేయడం నేరం. మైనర్లు డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. మైనర్లు డ్రైవ్ చేస్తే రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఎక్కువ. వారికే కాదు.. ఎదుటి వారికీ ప్రమాదమే. కాబట్టి, వారికి డ్రైవింగ్ అవకాశం ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. కానీ, చాలా మంది తల్లిదండ్రులు ఇవేవీ పట్టించుకోకుండా తమ మైనర్ పిల్లలకు బైక్ కీ అప్పజెబుతారు. అంతేకాదు, రకరకాల పనులకు పురమాయిస్తారు. పరోక్షంగా వారే మైనార్టీ తీరకముందే వాహనాలు వారికి అప్పగించి పనులు కూడా చెబుతారు. పనుల కోసమో.. సరదా కోసమో.. వారిని కాదనడం ఇష్టం లేకనో పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు ఎక్కువ మందే ఉంటారు. ఇలాంటి తల్లిదండ్రులే పుదుచ్చేరిలో తమ మైనర్ చిన్నారికి వాహనం అప్పజెప్పారు. దీంతో అధికారులు యాక్షన్ తీసుకున్నారు.
మైనర్ పిల్లాడిని డ్రైవింగ్ చేయనిచ్చారని తల్లిదండ్రులకు మూడేళ్ల జైలు శిక్ష విధించినట్టు పుదుచ్చేరి ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు, రూ. 25 వేల జరిమానా కూడా విధించిందని రవాణా శాఖ తెలిపింది. ఈ మేరకు విషయాన్ని వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.