రాహుల్ గాంధీ యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ స్లోగన్లు: బీజేపీ ఆరోపణలు.. ఖండంచిన కాంగ్రెస్
రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేశారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ వెంటనే రెస్పాండ్ అవుతూ ఆ వీడియోను ఫేక్ అని పేర్కొంది.
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పై బీజేపీ ఆరోపణలు సంధించింది. ఈ యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేశారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఓ వీడియోను పోస్టు చేస్తూ ఈ ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని రిచా చద్దా ప్రజలను కోరిన తర్వాత ఇప్పుడు ఖర్గావ్లో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేశారని ఆరోపించారు. ఈ వీడియోను కాంగ్రెస్ ఎంపీ పోస్టు చేశారని, ఆ తర్వాత విషయం తెలియగానే డిలీట్ చేశారని ట్వీట్ చేశారు. ఇది కాంగ్రెస్ వాస్తవికత అని పేర్కొన్నారు. దీనికి వెంటనే కాంగ్రెస్ స్పందించింది.
కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ఇంచార్జీ ఆఫ్ కమ్యూనికేషన్స్ జైరాం రమేశ్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ వీడియో నకిలీదని స్పష్టం చేశారు. బీజేపీకి ఉన్న డర్టీ ట్రిక్స్ డిపార్ట్మెంట్ ఈ ఫేక్ వీడియోను పోస్టు చేసిందని, విజయవంతంగా సాగుతున్న భారత్ జోడో యాత్రపై దుష్ప్రచారం కోసమే ఈ వీడియోను పోస్టు చేసిందని పేర్కొన్నారు. తాము వెంటనే లీగల్ యాక్షన్ తీసుకుంటున్నామని వివరించారు. ఇలాంటి ట్రిక్కులను తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బాధ్యులు మూల్యం చెల్లించాల్సిందే అని ట్వీట్ చేశారు.
Also Read: ఉజ్జయినిలో రాహుల్ గాంధీని చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తి అరెస్ట్
దేశవ్యాప్త కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీని మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించిన వెంటనే చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించిన వెంటనే రాహుల్ గాంధీపై బాంబులు వేసి చంపేస్తానంటూ గతవారం ఒక వ్యక్తి లేఖలతో బెదిరించాడు. అప్రమత్తమైన పోలీసులు గురువారం ఆ వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీని చంపేస్తానంటూ బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు కనీసం 200 సీసీటీవీలను తనిఖీ చేశారు.. అరడజను నగరాల్లోని హోటళ్లు, లాడ్జీలు, రైల్వే స్టేషన్లపై దాడులు చేశారు. ఈ క్రమంలోనే నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు.